India Beat Pakistan In Asia Champions Trophy Hockey Tournament: పాకిస్థాన్‌(Pakistan)తో మ్యాచ్ అంటే అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. అది క్రికెటైనా(Cricket), హాకీ(Hockey) అయినా మరే ఆట అయినా.. ఆ మ్యాచ్‌ను తమ జట్టే గెలవాలని ఆ దేశ అభిమానులు పూజలు చేస్తుంటారు. చివరి ఉత్కంఠభరితంగా సాగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు అభిమానులను మునివేళ్లపై నిలబెడతాయి. ఆసియా ఛాంపియన్స్‌  ట్రోఫీ(Asia Champions Trophy) హాకీలో అదే జరిగింది. ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు... ఛాంపియన్‌ ఆటతీరుతో అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచులు గెలిచి పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగన భారత హాకీ జట్టు... పాక్‌పైనా విజయం సాధించింది. 


చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్తాన్‌ను గెలుపుతో పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆసియా ఛాంపియన్స్‌ టోర్నీ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 2-1తో దాయాదిని మట్టికరిపించింది. లీగ్‌ దశలో ఓటమన్నదే లేకుండా భారత్‌  అజేయంగా సెమీస్‌కు  దూసుకెళ్లింది. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌- పాకిస్తాన్‌ ఇప్పటికే సెమీ ఫైనల్‌ చేరుకున్నాయి





 

టాప్‌ మనమే..

ఆసియా ఛాంపియన్స్‌  ట్రోఫీలో టీమిండియా పన్నెండు పాయింట్లతో పట్టికలో ఆగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఎనిమిది పాయింట్లతో పాక్‌  రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇరు జట్లు టాప్‌-4 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే, లీగ్‌ దశలో నామమాత్రపు పోరులో దాయాదులు పోటీపడటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. చిరకాల ప్రత్యర్థిపై 2-1తో భారత్ పైచేయి సాధించి జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌ మొదట్లోనే  పాక్ ప్లేయ‌ర్ అహ్మద్ న‌దీమ్ ఏడో నిమిషంలో గోల్ చేశాడు. దీంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అభిమానుల్లోనూ ఆందోళన రేగింది. ఆ త‌ర్వాత హ‌ర్మన్‌ప్రీత్ సింగ్‌.. వరుసగా రెండు గోల్స్ చేసి జ‌ట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు.  ఆట 13వ నిమిషంలో భార‌త కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ త‌న డ్రాగ్‌ఫ్లిక్‌తో తొలి గోల్,  19వ నిమిషంలో  పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. రెండు గోల్స్‌తో టీమిండియా లీడింగ్‌లో ఉన్నా.. బ‌ల‌మైన పాకిస్థాన్ చివరివరకూ విజయం కోసం పోరాడింది.

 


 

సెమీస్‌ బెర్తులు ఖాయం

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెమీఫైన‌ల్ బెర్తులు ఖరార‌య్యాయి. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త పురుషుల హాకీ జ‌ట్టు అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్రస్థానంలో ఉన్న భార‌త్‌, నాలుగో స్థానంలోని కొరియాల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 16వ తేదీన‌ తొలి సెమీస్ జ‌రుగ‌నుంది. అదే రోజు రెండో సెమీఫైన‌ల్లో పాకిస్థాన్‌, చైనా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐదు, ఆరో స్థానం కోసం జ‌పాన్, మ‌లేషియాలు పోటీప‌డ‌నున్నాయి.

 


 

హాకీలో స్వర్ణ యుగమే

పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఛాంపియన్‌ ఆటతీరుతో అదరగొడుతోంది. లీగ్‌ దశలో ఆడిన అయిదు మ్యాచుల్లోనూ  విజయం సాధించి సత్తా చాటింది.