భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో దక్ణిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (124: 130 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మరో వికెట్ యజ్వేంద్ర చాహల్ ఖాతాలో పడింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ జానేమన్ మలన్ (1: 6 బంతుల్లో) మూడో ఓవర్లోనే అవుటయ్యాయి. ఫాంలో ఉన్న కెప్టెన్ టెంబా బవుమా (8: 12 బంతుల్లో, ఒక ఫోర్) వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే తను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవ్వడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది.


ఆ తర్వాత వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్ (15: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్న మరోవైపు క్వింటన్ డికాక్ మాత్రం క్రీజులో నిలబడిపోయాడు. దక్షిణాఫ్రికా 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో డికాక్‌కు వాన్ డర్ డుసెన్ (52: 59 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) జత కలిశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఈ దశలోనే డికాక్ సెంచరీ కూడా పూర్తయింది.


ఇన్నింగ్స్ 36వ ఓవర్లో డికాక్‌ను అవుట్ చేసి బుమ్రా భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే వాన్ డర్ డుసెన్, ఫెలుక్వాయో (4: 11 బంతుల్లో) కూడా అవుటయ్యారు. ఒక వైపు వికెట్లు పడుతున్నా డేవిడ్ మిల్లర్ (39: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మరోవైపు వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొమ్మిదో వికెట్‌గా మిల్లర్ వెనుదిరిగాడు. ఆ తర్వాత మగల కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో తొలిసారి ఆలౌట్ అయింది.