IND vs ENG 5th Test Virat Kohli or Rishabh Pant who will lead India After Captain Rohit Sharma Tested Covid-19 Positive : సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలోనే టీమ్‌ఇండియా ఓ అరుదైన ఘనత ముగిట నిలిచింది! ఇంగ్లాండ్‌ గడ్డపైనే ఆంగ్లేయులను ఓడించేందుకు సిద్ధమైంది. ఐదు టెస్టు సిరీసులో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి మ్యాచును కనీసం డ్రా చేసుకుంటే చాలు! సిరీస్ ఇండియా వశం అవుతుంది. అలాంటి కీలకమైన మ్యాచుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు. మరి ఆఖరి సమరానికి సారథ్యం వహించేది ఎవరు?


Also Read: ఐపీఎల్‌ స్టార్లు, ఐర్లాండ్‌కు యుద్ధం! గెలుపెవరిదో నేడు చూసేద్దాం!!


అజింక్య లేడు


ప్రస్తుతం టీమ్‌ఇండియా లీసెస్టర్‌ షైర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఆటగాళ్లు పట్టుదలగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లో ఆటగాళ్లకు నిరంతరం టెస్టులు చేస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి అందరికీ ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. జట్టు బస చేసిన హోటల్లోనే అతడిని ఐసోలేషనుకు పంపించామని వెల్లడించింది. దాంతో మళ్లీ ఇప్పుడు నాయకత్వ సమస్య మొదలైంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వైస్‌ కెప్టెన్‌ సారథిగా ఉంటాడు. అజింక్య రహానె (Ajinkya Rahane) ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవాడు. ఫామ్‌ లేమితో అతడిని ఎంపిక చేయకపోవడంతో మళ్లీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), రిషభ్ పంత్‌ (Rishabh Pant) వైపు చూడాల్సి వస్తోంది.


కింగ్‌ను మళ్లీ చూస్తామా?


టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! భారత క్రికెట్‌ చరిత్రలోనే ఎవరికీ లేని రికార్డులను అతడు సృష్టించాడు. అద్భుతమైన విజయాలు అందించాడు. అత్యధిక విజయాల శాతమూ అతడితే. ఏకంగా 68 టెస్టులకు సారథ్యం వహించాడు. 40 గెలిపించాడు. 17 ఓడిపోయాడు. వాస్తవంగా 2021లో ఈ టెస్టు సిరీసుకు కోహ్లీయే నాయకుడు. టోర్నీ సాంతం అతడు రాణించాడు. 2-1తో జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఇవన్నీ చూస్తే ఆఖరి టెస్టుకు అతడే కెప్టెన్సీ చేయడం న్యాయం! బహుశా బీసీసీఐ సైతం ఇలాగే ఆలోచిస్తుండొచ్చు.


పంత్‌ లేదంటే శ్రేయస్‌!


భారత్‌కు ఉన్న మరో అవకాశం రిషభ్ పంత్‌! గాయంతో కేఎల్‌ రాహుల్‌ దూరమవ్వడంతో అతడే ఈ సమస్యను తీరుస్తున్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను బాగానే నడిపిస్తున్నాడు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుంటూ రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసులోనూ అతడి నాయకత్వం అందరినీ ఆకట్టుకుంది. పొరపాట్లు చేస్తున్నా త్వరగానే సరిదిద్దుకుంటున్నాడు. పైగా దేశవాళీ క్రికెట్లో దిల్లీని నడిపించిన అనుభవం ఉంది. ముంబయి కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌కు ఛాన్సిచ్చినా ఆశ్చర్యం లేదు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను నడిపించిన ఎక్స్‌పీరియన్స్‌ ఉంది. రంజీ టోర్నీల్లో ముంబయిని విజేగా నిలిపిన తెగువ అతడి సొంతం. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.