IND vs AUS 4th Test: అనుకున్నదే అవుతోంది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా మాదిరిగానే భారత బ్యాటర్లు కూడా    పరుగుల పండుగ చేసుకుంటున్నారు. గత మూడు టెస్టులకు భిన్నంగా రూపొందించిన అహ్మదాబాద్ పిచ్ పై  తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 99 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.  టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్  (235 బంతుల్లో  128, 12 ఫోర్లు, 1 సిక్సర్)  సెంచరీతో కదం తొక్కగా  సుమారు 13 నెలల తర్వాత విరాట్ కోహ్లీ (128 బంతుల్లో 59 నాటౌట్, 5ఫోర్లు)  టెస్టులలో అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం  కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా  (54 బంతుల్లో 16 నాటౌట్, 1 సిక్స్) లు క్రీజులో ఉన్నారు.  


ఫామ్ కొనసాగించిన గిల్.. 


ఈ ఏడాది వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా క్రీజులోకి  వస్తే  సెంచరీల మోత మోగిస్తున్న పంజాబ్ కుర్రాడు శుబ్‌మన్ గిల్  తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సిరీస్ లో చోటు దక్కించుకున్నా తొలి రెండు టెస్టులలో ఆడే అవకాశం రాని గిల్.. ఇండోర్ లో విఫలమైనా అహ్మదాబాద్ లో ఆకట్టుకున్నాడు. 


ఓవర్ నైట్ స్కోరు 36-0 వద్ద భారత ఇన్నింగ్స్ ఆరంభం కాగా క్రీజులో కుదురుకుంటున్న రోహిత్  శర్మ (35) ను కుహ్నేమన్ ఔట్ చేశాడు.  అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన  పుజారా (42)  తో కలిసి  గిల్  ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆసీస్ స్పిన్ త్రయం  లియాన్, కుహ్నేమన్,   మర్ఫీ లతో పాటు  పేసర్ల ద్వయం  మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ లను  సమర్థవంతంగా ఎదుర్కున్నారు.  లంచ్  తర్వాత గిల్.. మర్ఫీ వేసిన  61వ ఓవర్ లో  రెండో బంతిని బౌండరీకి తరలించి  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.   టెస్టులలో ఇది అతడికి రెండో సెంచరీ కాగా  స్వదేశంలో మొదటిది. అయితే అదే ఓవర్లో  మర్ఫీ.. పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  


కోహ్లీ కమాల్..  


పుజారాతో  రెండో వికెట్ కు 113 పరుగులు  జోడించిన  గిల్.. తర్వాత కోహ్లీతో కూడా  అదే జోరును ప్రదర్శించాడు.   మూడో వికెట్ కు గిల్ - కోహ్లీలు 58 పరుగులు జోడించారు.   అయితే   సెంచరీ తర్వాత  గిల్‌ను  లియాన్..  78వ ఓవర్లో నాలుగో బంతికి  ఎల్బీ ద్వారా పెవిలియన్‌కు పంపాడు.  గిల్ నిష్క్రమించినా  చివరి సెషన్ లో  మరో వికెట్ కోసం ఆశించిన  ఆసీస్ ఆటగాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు.  రవీంద్ర జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా కోహ్లీ జాగ్రత్త పడ్డాడు.  ఈ క్రమంలో లియాన్ వేసిన   92 వ ఓవర్లో నాలుగో బంతికి  రెండు పరుగులు తీయడం ద్వారా  విరాట్ అర్థ శతకం పూర్తి చేశాడు.  2022 జనవరి తర్వాత.. సుమారు 16 టెస్టు ఇన్నింగ్స్ ల అనంతరం కోహ్లీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.  


డ్రా దిశగా.. 


అహ్మదాబాద్ టెస్టు మొదలై మూడు రోజులు కావస్తోంది. ఇప్పటికీ రెండు జట్లు తొలి ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేకపోయాయి.   మూడో రోజు పొద్దంతా బౌలింగ్ చేసిన  ఆసీస్ బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీశారు.  నాలుగో రోజు కూడా  పిచ్ బ్యాటర్లకే అనుకూలంగా ఉండొచ్చు. అదే జరిగితే  భారత్ కు ఇంకా  బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. విరాట్,  జడ్డూ క్రీజులో ఉండగా  తర్వాత శ్రేయాస్ అయ్యర్, భరత్, అక్షర్ పటేల్, అశ్విన్ లు  కూడా తలో చేయి వేయగలిగితే  ఆదివారం మొత్తం   టీమిండియా బ్యాటింగ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   ఈ నేపథ్యంలో ఏదైనా అద్భుతం  జరిగితే తప్ప ఈ టెస్టులో ఫలితం తేలేది అనుమానమే...!