IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (31: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లు దక్కించుకున్నాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఓవర్లోనే మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో బంతిని కట్ చేయబోయిన శుభ్‌మన్ గిల్ (0: 2 బంతుల్లో) మార్నస్ లబుషేన్ చేతికి చిక్కాడు. దీంతో మూడు పరుగులకే భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీతో (31: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కలిసి రోహిత్ శర్మ (13: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) కాసేపు వేగంగా ఆడాడు. అయితే కాసేపటికే మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కు రోహిత్ చిక్కాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ (0: 1 బంతి) కూడా ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. తొమ్మిదో ఓవర్లోనే కేఎల్ రాహుల్‌ను (9: 12 బంతుల్లో, ఒక ఫోర్) కూడా మిషెల్ స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మొదటి నాలుగు వికెట్లూ మిషెల్ స్టార్కే దక్కించుకున్నాడు.


ఇక్కడి నుంచి నాథన్ ఎల్లిస్, సీన్ అబాట్ వికెట్లు పడగొట్టే బాధ్యతను తీసుకున్నారు. 10వ ఓవర్లోనే హార్దిక్ పాండ్యాను (1: 3 బంతుల్లో) సీన్ అబాట్ అవుట్ చేశాడు. దీంతో 49 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఏడో వికెట్‌కు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా (16: 39 బంతుల్లో, ఒక ఫోర్) 22 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ కుదుటబడుతున్న టైమ్‌లో విరాట్ కోహ్లీని నాథన్ ఎల్లిస్ అవుట్ చేశాడు.


తర్వాత కాసేపటికే ఎక్కువ సేపు ఎవరూ క్రీజులో నిలబడలేదు. చివర్లో అక్షర్ పటేల్ (29: 29 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 100 పరుగుల మార్కును దాటింది. 26 ఓవర్లలో భారత్ 117 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టారు.


భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ


ఆస్ట్రేలియా తుది జట్టు
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా


ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులు చేసింది. ఇషాన్ కిషన్ స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. పేస్ ఆల్‌ రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు జట్టులో స్థానం దక్కింది. 


మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ జట్టుకు రెండు మార్పులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఎల్లిస్, జోస్ ఇంగ్లిస్ స్థానంలో అలెక్స్ కారీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.