తప్పక గెలవాల్సిన మ్యాచులో అమ్మాయిలు అద్భుతం చేశారు! సెమీస్‌కు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచులో దుమ్మురేపారు! ఐసీసీ మహిళల వన్డే మ్యాచులో మిథాలీ సేన మూడో విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 110 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 230 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 40.౩ ఓవర్లకు 119కే కుప్పకూల్చింది. స్నేహ్‌రాణా (4/30) తన స్పిన్‌తో బంగ్లా పతనాన్ని శాసించింది. లతా మొండల్‌ (24), సల్మా ఖాటూన్‌ (32) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో యస్తికా భాటియా (50; 80 బంతుల్లో 2x4), షెఫాలీ వర్మ (42; 32 బంతుల్లో 6x4, 1x6) అదరగొట్టారు.


స్నేహ్‌ రాణా స్టన్నింగ్‌ పెర్ఫామెన్స్‌


సెడాన్‌ పిచ్‌ ఈ రోజు బౌలర్లకు అనుకూలించింది. ముఖ్యంగా స్లోగా ఫ్లయిటెడ్‌ డెలివరీలు వేసే స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. బంతి అనుకున్నంత వేగంగా బ్యాటు మీదకు రావడం లేదు. ఈ అడ్వాంటేజెస్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. సగటుకు ప్రతి పది పరుగులకు ఒక వికెట్‌ చొప్పున పడగొట్టారు. జట్టు స్కోరు 35కే బంగ్లా 5 వికెట్లు చేజార్చుకుంది. 12 వద్ద షర్మిన్‌ (5)ను గైక్వాడ్‌, 15 వద్ద ఫర్గానా (0)ను వస్త్రాకర్‌, 28 వద్ద నిగర్‌ సుల్తానా (3)ను స్నేహ, 31 వద్ద ముర్షిదా ఖాటూన్‌ (19)ను పూనమ్‌, 35 వద్ద రుమానా అహ్మద్‌ (2)ను స్నేహ ఔట్‌ చేశారు. ఈ క్రమంలో లతా మొండల్‌ (24), సల్మా ఖాటూన్‌ (32) పోరాడే ప్రయత్నం చేసినా అప్పటికే రన్‌రేట్‌ పెరగడంతో బంగ్లా ఒత్తిడికి లోనైంది. ఆఖర్లో మళ్లీ స్నేహ, పూజా విజృంభించి వికెట్లు పడగొట్టారు. 119కి ఆలౌట్‌ చేశారు.


యస్తికా టాప్‌ క్లాస్‌, జట్టుగా పోరాటం


టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ మాత్రం రోలర్‌ కోస్టర్‌ను తలపించింది. మొదట స్మృతి మంధాన (30), షెఫాలీ వర్మ (42) అదిరే ఆరంభం ఇచ్చారు. మొదట్లో పిచ్‌ పరిస్థితులను గమనించి నిలకడగా ఆడారు. ఆ తర్వాత వేగం పెంచారు. 15 ఓవర్లకు 74 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇదే స్కోరు వద్ద మిథాలీ సేనకు వరుస షాకులు తగిలాయి. వరుసగా స్మృతి, షెఫాలీ, మిథాలీ ఔటయ్యారు. దాంతో హర్మన్‌ప్రీత్‌ (14) సాయంతో యస్తికా భాటియా (50) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. నిలకడగా ఆడుతూ పరుగులు చేసింది. హర్మన్‌ ఔటయ్యాక రిచా ఘోష్‌ (26) విలువైన ఇన్నింగ్స్‌ ఆడింది. మూడు బౌండరీలు బాది ఊపు తెచ్చింది. కీలక సమయంలో యస్తికా, రిచా ఔటైనా ఆఖర్లో పూజా వస్త్రాకర్‌ (30 నాటౌట్‌), స్నేహ రాణా (27) దూకుడుగా ఆడి టీమ్‌ఇండియా స్కోరును 229/7కు చేర్చారు.