Abhishek Sharma- Yuvaraj singh: జింబాబ్వే(ZIM)తో జరిగిన రెండో టీ 20లో శతకంతో నయా సెన్సేషన్‌గా మారిన తెలుగు కుర్రాడు అభిషేక్‌ శర్మ(Abhishek Sharma) గురించిన ప్రతీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. యువ భారత్ సారధి శుభ్‌మన్‌గిల్‌ నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన అభిషేక్‌... ఇప్పుడు మూడో టీ 20పై దృష్టి పెట్టాడు. రేపు జరిగే మ్యాచ్‌లో మరోసారి సత్తా చాటి తన సెంచరీ గాలివాటం కాదని నిరూపించాలన్న కసితో అభిషేక్ ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో తాను డకౌట్‌ అయిన అనంతరం యువరాజ్‌ సింగ్‌(Yuvaraj singh)... చాలా సంతోషించాడని అభిషేక్‌ తాజాగా వ్యాఖ్యానించాడు. ఇంతకీ యువరాజ్‌ ఎందుకు ఆనందించాడంటే..?


 





డకౌట్‌ అయితే ఆనందమా..?

తొలి మ్యాచ్‌లో తాను డకౌట్‌ అయినప్పుడు యువరాజ్ సింగ్ చాలా సంతోషించాడని అభిషేక్ శర్మ తెలిపాడు. తాను తొలి మ్యాచ్‌ ఆడిన అనంతరం యువీతో మాట్లాడానని.. తాను డకౌట్‌ అయినందుకు చాలా సంతోషించాడని... ఇది మంచి ఆరంభమని తనతో యువరాజ్‌ అన్నాడని అభిషేక్‌ తెలిపాడు. యువీ ఇప్పుడు తన కుటుంబ సభ్యుడని అతడు గర్వపడేలా చేస్తానని వెల్లడించాడు. యువరాజ్‌ తన నైపుణ్యాలను మెరుగుపర్చడంలో సహాయం చేయడమే కాకుండా... వ్యక్తిగత జీవితంలోనూ తనకు అండగా నిలిచాడని అభిషేక్‌ బీసీసీఐ షేర్‌ చేసిన వీడియోలో తెలిపాడు. ఇవాళ తాను సాధించిందంతా యువరాజ్‌ వల్లేనని తెలిపిన అభిషేక్‌... గత రెండు మూడేళ్లుగా క్రికెట్‌ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ తనకు మద్దతుగా ఉన్నాడని గుర్తు చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌ డకౌట్‌ తర్వాత బాగా చేశావని... తనకు చాలా గర్వంగా ఉంది... ఇలాంటి డకౌట్‌ ఇన్నింగ్స్‌లు రావడం ప్రారంభం మాత్రమే అని యువరాజ్ అన్నాడని తెలిపాడు. తొలి మ్యాచ్‌లో ఓడిపోయన తమకు రెండో మ్యాచ్‌ గురించి ఆలోచించేందుకు ఎక్కువ సమయం లభించలేదని అదే తమకు కలిసి వచ్చిందని అభిషేక్‌ తెలిపాడు. 

 

ప్రస్తుతాని సమంగా..

ఐదు మ్యాచ్‌ల టీ సిరీస్‌లో ఇప్పుడు భారత్‌-జింబాబ్వే 1-1తో సమంగా ఉన్నాయి. 

జింబాబ్వేతో జరిగిన తన తొలి టీ 20లో అభిషేక్‌ డకౌట్ అయ్యాడు. రెండో టీ 20లో 23 ఏళ్ల అభిషేక్‌ శతకంతో చెలరేగాడు. 47-బంతుల్లో 100 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు అభిషేక్‌ 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశాడు. తనకు బ్యాట్‌ ఇచ్చినందుకు భారత కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌కు అభిషేక్‌ మరోసారి కృతజ్ఞతలు తెలిపాడు. తన బ్యాట్‌ను అందించిన శుభ్‌మన్‌కు ప్రత్యేక ధన్యవాదాలని... ఇది వ్యక్తిగతంగా తనకు, జట్టుకు చాలా అవసరమైన ఇన్నింగ్స్ అని  టీ 20 మ్యాచ్‌లో శతకం అనంతరం అభిషేక్‌ కామెంట్స్‌ చేశాడు.