స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైన కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అక్టోబర్‌ ఎనిమిదిన అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోరుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. కంగారులతో మ్యాచ్‌కు అంతా సిద్ధమే అని భావిస్తున్న వేళ రోహిత్‌ సేనకు పెద్ద షాక్‌ తగిలేలా ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డెంగీ బారినపడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఎక్కువ పరుగులు సాధించే ఆటగాడిగా గిల్‌ నిలుస్తాడని అంచనాలు ఉన్న వేళ శుభ్‌మన్‌ డెంగీ బారిన పడడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌ను ఘన విజయంతో ప్రారంభించాలని భావిస్తున్న భారత జట్టుకు గిల్‌కు డెంగి సోకిందన్న వార్త కలవరానికి గురి చేస్తోంది.


ఒకవేళ శుభ్‌మన్‌గిల్‌కు డెంగీ సోకిందన్న వార్త నిజమే అయితే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు ఈ ఓపెనర్‌ దూరంగా ఉండే అవకాశం ఉంది. గిల్‌కు డెంగీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం శుభ్‌మన్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇవాళ గిల్‌కు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారని, అతడు కోలుకోకపోతే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమైనట్లేనని వెల్లడించాయి. ప్రపంచకప్‌నకు ముందు జరగాల్సిన రెండు వామప్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దవడంతో శుభ్‌మన్ గిల్ ఫీల్డ్‌లో కనిపించలేదు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్‌ వన్డేల్లో 1230 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. 


గిల్‌ దూరమైతే అతని స్థానంలో ఓపెనర్‌గా ఎవరూ బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. గిల్‌ స్థానంలో కె.ఎల్‌. రాహుల్‌ లేకపోతే ఇషాన్‌ కిషన్‌ను బరిలోకి దింపాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తున్నట్టు తెలస్తుంది. లెఫ్ట్‌, రైట్‌ హ్యాండ్‌ కాంబినేషన్లకు ప్రాధాన్యమిస్తే రోహిత్ శర్మతో కలిసి ఇషాన్‌ కిషన్‌.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రాహుల్‌ 16 వన్డే మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోగి దిగగా 669 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాబట్టి రాహుల్‌నే రోహిత్‌తో ఓపెనర్‌గా బరిలోకి దింపే ఆలోచన కూడా చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియా ఆక్టోబర్‌ 14న దాయాది దేశం పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఈ హైటెన్షన్‌ పోరుకు భారత్ సిద్ధమవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో గిల్‌ డెంగీ బారినపడడం ఆందోళనకు గురిచేస్తోంది.


రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో జరిగే ఈ ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో భారత్‌ ఏ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో అధికం గెలిచి ఎలాంటి అవరోధాలు లేకుండా సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా... స్వదేశంలో మూడోసారి ప్రపంచకప్‌ అందుకోవాలన్న తలంపుతో ఉంది.


Also Read: 2023 ప్రపంచ కప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?


Also Read: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్