Virat Kohli In Newyork: సెలబ్రిటీలకు ఫోటో గ్రాఫర్లకు విడదీయలేని అనుబంధం ఉంది.  భారత దేశంలో సెలబ్రిటీలను సెలబ్రిటీలు చేసిందే ఈ ఫొటో గ్రాఫర్లు. అందుకే వీరికంటూ సపరేటు ఫ్యాన్ బేస్ ఉంటుంది.  ఫొటో గ్రాఫర్లు కనపడగానే ఆప్యాయంగా పలకరిస్తుంటారు సెలబ్రిటీలు. కొంత మంది సెలబ్రిటీలు మాత్రం తమకు పర్సనల్ లైఫే లేకుండా చేస్తున్నారంటూ ఫొటో గ్రాఫర్ల మీద మండిపడుతుంటారు.  అయితే ఫొటోలు తీసినందుకు కాదు... ఫొటోలు తీయనందుకు ముంబై లోని ఫొటో గ్రాఫర్లకు ఓ సెలబ్రిటీ జంట నజరానా అందించింది. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. 


టీ 20 ప్రపంచ కప్‌‌కి తెరలేచింది. ఈ రోజు అమెరికా, కెనడా జట్ల మధ్య జరుగ బోయే మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతోంది. అలాగే ఈ రోజే బంగ్లాదేశ్ తో ఇండియా కూడా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇండియన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అన్న విషయంపై కొనసాగిన సస్పన్స్‌కు తెరపడింది. భారత్ బృందంలో విరాట్ శుక్రవారమే చేరిపోయినా.. ప్రయాణ బడలిక వల్ల ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో ఆడటం లేదని అనుమానం కలిగింది. అంతకు ముందు రోజు అంటే గురువారం రాత్రి న్యూయార్క్ వెళ్లేందకు ఎయిర్ పోర్టుకు వచ్చిన కోహ్లీ ఫోటో గ్రాఫర్లతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.


విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఈ ఏడాది కొడుకు పుట్టిన విషయం తెలిసిందే . లండన్ లో ఫిబ్రవరి 15న అకాయ్ జన్మించాడు. అయితే ఐపీఎల్ కు కొద్ది రోజుల ముందు వారు లండన్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ముంబై ఎయిర్ పోర్టులో దిగగా.. ఫోటో గ్రాఫర్లు వారిని ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపించారు. అయితే .. అప్పుడే పుట్టిన తమ బాబును ఫొటోలు తీయడం సరికదనుకున్నారో ఏమో తెలీదు కానీ.. తమ కొడుకు అకాయ్, కూతురు వామికలను ఫొటోలకు దూరంగా ఉంచాలంటూ ముంబై ఎయిర్ పోర్టులో ఫొటో గ్రాఫర్లకు ఈ జంట రిక్వెస్ట్ చేసింది.  ఫొటో గ్రాఫర్లు కూడా ఈ జంట మాటను తీసి పడేయకుండా.. వారిని ఇబ్బంది పెట్టకుండా వదిలేశారు. 


ఫొటో గ్రాఫర్లు తమ మాటకు గౌరవం ఇవ్వడంతో అనుష్క విరాట్ జంట మే 14న వీరికి ఓ గిఫ్ట్ హ్యాంపర్ పంపింది. ‘‘మా పిల్లల ప్రైవసీని కాపాడటానికి మాకు సహకరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్’’ అంటూ దాంతో పాటు ఓ నోట్ కూడా పంపింది. 


గురువారం రాత్రి న్యూయార్క్ వెళ్లేందకు ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చిన కోహ్లీతో ఫొటో గ్రాఫర్లు.. ‘‘ థాంక్యూ ఫర్ ద గిఫ్ట్ సర్’’ అనగా.. కోహ్లీ వారికి  ‘‘నేను కాదు  భాయ్ దాన్నిచ్చింది. మేడమ్ ఇచ్చింది’’ అంటూ క్రెడిట్ అంతా తన భార్య ఖతాలో వేశాడు. దీంతో  ‘‘మేడమ్ కు కూడా థ్యాంక్స్ చెప్పండి సర్’’  అంటూ ఫొటో గ్రాఫర్లు కోహ్లీతో చెప్పారు.  ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.