ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోని గ్రూప్-2లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ నెదర్లాండ్స్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికా భారత్‌ను చిత్తు చేసింది. మూడు రౌండ్ల మ్యాచ్‌లు ముగిసేసరికి గ్రూప్-2లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌, జింబాబ్వేలపై పరాజయం చవిచూసిన బాబర్‌ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ఇప్పటికీ సెమీఫైనల్‌ పోటీ నుంచి తప్పుకోలేదు.


ప్రస్తుతం దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌లలో 5 పాయింట్లను సాధించగా, భారత్, బంగ్లాదేశ్ చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. జింబాబ్వేకు 3 పాయింట్లు ఉండగా, పాకిస్థాన్‌కు 2 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ ఇంతవరకు ఖాతా తెరవలేదు. అయితే భారత్‌కు +0.844 నెట్ రన్ రేట్ ఉండటంతో మూడో స్థానంలో నిలిచింది. బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. సెమీ-ఫైనల్ రేసులో ఎవరు ముందున్నారనే విషయాన్ని నిర్ణయించడంలో ఈ మ్యాచ్ కీలకం కానుంది.


దక్షిణాఫ్రికా అద్భుతమైన నెట్ రన్ రేట్ +2.772ని కలిగి ఉంది. అందువల్ల వారు గ్రూప్ 2 నుండి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడానికి క్లియర్ కట్ ఫేవరెట్‌లుగా ఉన్నారు. పాకిస్థాన్ గురించి చెప్పాలంటే వారి సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. కానీ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై విజయాలను నమోదు చేసి నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకుంటే అప్పుడు పాకిస్తాన్ రేసులోకి వచ్చే అవకాశం ఉంది.


దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను పాక్ గెలిస్తే 6 పాయింట్లకు చేరుకుంటుంది. ఆపైన మిగతా వారి ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌పై జింబాబ్వే ఓడిపోవడం ఇప్పుడు వారిని వెనుకకు పంపింది. ఇక జింబాబ్వే సెమీస్‌కు వెళ్లే అవకాశం లేదు.