How the unprecedented face-off happened and its impact: దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), శ్రేయస్స్‌ అయ్యర్‌(Shreyas iyer)పై బీసీసీఐ(BCCI) కొరఢా ఝుళిపించింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. గ‌తేడాది ప్రక‌టించిన కాంట్రాక్ట్ లిస్ట్‌లో శ్రేయ‌స్ అయ్యర్ B గ్రేడ్‌లో ఉండ‌గా, ఇషాన్‌కిష‌న్ C గ్రేడ్‌లో ఉన్నారు. రెగ్యూలర్ టీమ్ తో ఉంటూ సిరీస్‌లకు ఎంపిక అవుతున్న ఇలాంటి ప్లేయ‌ర్లని ఈసారి BCCI ఇషాన్‌, శ్రేయ‌స్‌ల‌ను త‌ప్పించింది. అయితే ఇషాన్‌ను తప్పించే ముందు బీసీసీఐ అతనికి సువర్ణావకాశం ఇచ్చిందని తెలుస్తోంది. కానీ ఆ అవకాశాన్ని ఇషాన్‌ చేజేతులా వదిలేశాడు.


ఇషాన్‌కు బీసీసీఐ ఏం చెప్పిందంటే..?
ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు జట్టును ప్రకటించేముందు ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐ సెలక్టర్లు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వైజాగ్‌ టెస్టు తర్వాత జట్టుతో కలవాలని సెలక్టర్లు ఇషాన్‌ను ఆదేశించినా... అతను నిరాకరించినట్లు తెలుస్తోంది. తాను ఇంకా సిద్దంగా లేనని, మరి కొంత సమయం తనకు కావాలని సెలక్టర్లకు కిషన్‌ చెప్పినట్లు సమాచారం. ఇషాన్‌ ఆడేందుకు నిరాకరించడంతోనే ధ్రువ్‌ జురెల్‌ను మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కొనసాగించింది. అయితే బీసీసీఐ నో చెప్పిన కిషన్‌.. ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ కోసం మాత్రం బరోడాకు వెళ్లినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.


మానసిక కుంగుబాటేనా.?
గత ఏడాదంతా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.



బీసీసీఐ ఆగ్రహం
టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah)... తీవ్ర హెచ్చరికలు చేశాడు. గాయమైతే తప్ప.. రంజీ ట్రోఫీ లేదా ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోతే  తీవ్ర పర్యవసనాలు ఉంటాయని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను, భారత్‌-ఏ స్థాయి ఆటగాళ్లను జై షా హెచ్చరించాడు. ఈ మేరకు క్రికెటర్లకు అతడు లేఖ రాశాడు. జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెట్‌ ముఖ్యమైన కొలబద్ద అని షా స్పష్టం చేశాడు. కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తున్నారని.. ఇదా తాము ఊహించలేదని జై షా అన్నాడు.