Viral Video: 


టీమ్‌ఇండియాలో బ్యాచిలర్స్‌ సంఖ్య తగ్గిపోతోంది! కుర్రాళ్లంతా ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి ఒక్కటయ్యారు. ముంబయిలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఆ వెంటనే అక్షర్‌ పటేల్‌ పెళ్లి పీటలు ఎక్కేశాడు. తన ప్రేయసి మెహ్‌ పటేల్‌ మెడలో తాళి కట్టేశాడు. ఇప్పుడు శార్దూల్‌ ఠాకూర్‌ వంతు వచ్చేసింది!




యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఫిబ్రవరి 27న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సోమవారం మితాళీ పారుల్కర్‌తో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ముంబయిలో జరిగే ఈ పెళ్లికి 200-300 మంది అథితులు రాబోతున్నారు. ఆదివారం వీరు హల్దీ వేడుక నిర్వహించారు. ఇందులో కొత్త జంట బాలీవుడ్‌ పాటలకు డాన్స్‌ చేసి అలరించారు. శ్రేయస్‌ అయ్యర్‌ సహా మరికొందరు క్రికెటర్లు వారిని ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.




శార్దూల్‌ ఠాకూర్‌ నల్లరంగు కుర్తా ధరించగా మితాళీ డిజైనర్‌ లెహంగాతో మెరిసిపోయింది. నిజానికి వీరిద్దరూ మిత్రులు. చాన్నాళ్లుగా ఒకరికొకరు తెలుసు. 2021, నవంబర్లో వీరికి నిశ్చితార్థం జరిగింది. టీ20 ప్రపంచకప్‌ ముగిశాక 2022, అక్టోబర్లోనే వీరు పెళ్లి చేసుకోవాల్సింది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. చివరికి సోమవారం వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు.