Rohit Sharma Tested Covid19 Positive: ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలకమైన 5వ టెస్టుకు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)లో కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో కీలకమైన చివరి టెస్టుకు ముందు రోహిత్ శర్మను ఐసోలేషన్ లో ఉంచినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పేర్కొంది. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ రోహిత్ అందుబాటులోకి రాకపోతే కెప్టెన్సీ ఎవరు చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో ఇది వరకే చివరి టెస్టుకు దూరమయ్యాడు.


టీమిండియాకు కరోనా పరీక్షలు..
భారత ఆటగాళ్లకు బీసీసీఐ శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) నిర్వహించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల విరాట్ కోహ్లీకి కరోనా సోకగా, ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఆపై కోలుకుని జట్టుతో చేరి ఇంగ్లాండ్‌తో 5వ టెస్టుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా రోహిత్ కు కరోనా సోకగా, ప్రస్తుతం టీమ్ హోటల్‌లో ఒంటరిగా ఉన్నాడు. బీసీసీఐ వైద్య బృందం సంరక్షణలో రోహిత్ ఉన్నాడని, ఆదివారం RT-PCR పరీక్ష నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది.






వార్మప్ మ్యాచ్‌లో బ్యాటింగ్..
లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న వార్మప్ గేమ్‌లో రోహిత్ శర్మ మొదటి రోజు బ్యాటింగ్ చేశాడు. కానీ రెండో రోజు ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి దిగలేదు. భారత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కు కూడా దిగలేదు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో రోహిత్‌తో పాటు శుభ్‌మాన్ గిల్ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంది. కానీ రోహిత్ ఈ నాలుగు రోజుల్లో కోలుకుంటేనే చివరి టెస్టు ఆడతాడు. 


ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం టీమిండియా యూకే పర్యటనకు బయలుదేరే ముందు నిర్వహించిన టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో జట్టుతో ఆలస్యంగా చేరాడు. ప్రస్తుతం యూకే మ్యాచ్‌లు బయో బబుల్ కింద నిర్వహించడం లేదు. భారత్ కూడా నిర్వమించిన దక్షిణాఫ్రికా సిరీస్‌లను బయో బబుల్ లేకుండా ఆతిథ్యం ఇచ్చింది.
Also Read: India vs Leicestershire: దటీజ్‌ విరాట్‌ కోహ్లీ! ఆగ్రహంతో ఇండియన్‌ ఫ్యాన్స్‌నీ తిట్టేశాడు!!


Also Read: APL League : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కు నెల్లూరు కుర్రాళ్ల ఎంపిక, జులై 6 నుంచి మ్యాచ్ లు