PM Modi congratulated Team India: సెమీ ఫైనల్స్ లో గెలిచి రికార్డులు కొల్లగొట్టిన టీం ఇండియా పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.   న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు. 113 బంతుల్లో 117 రన్స్ సాధించాడు. ఈ ఘనత సాధించినందుకు విరాట్ కోహ్లీకి  ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi) తో సహా పలువురు వారి సోషల్ మీడియా అకౌంటు ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందనలు తెలియజేశారు.

 

 కింగ్ విరాట్ కోహ్లీకి  ప్రధాని నరేంద్ర మోడీ, 50వ సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీ తన 50 సెంచరీని సాధించమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి నిర్వచించే పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడన్నారు. ఈ అద్బుతమైన మైలురాయి, అతని నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం మన్నారు. కోహ్లీ భవిష్యత్ తరాలకు ఒక   బెంచ్‌మార్క్ సెట్  చేసాడంటూ ట్వీట్ చేశారు. అలాగే టీమిండియాకు తన అభినందనలు తెలిపారు. టీం గానే కాదు వ్యక్తిగతంగా కూడా అద్భుతాలు ఆవిష్కరించిన షమీ కి కూడా అభినందనలు తెలిపారు. 

 

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. క్రికెట్‌ గాడ్‌, తన ఆరాధ్య ధైవం సచిన్‌ టెండూల్కర్‌ ఎదుటే.. అతని మైదానంలోనే  రెండు దశాబ్దాలుగా తన పేరిట ఉన్న రికార్డును విరాట్‌ బద్దలు కొట్టేశాడు. 2011 ప్రపంచకప్‌ను టీమిండియా సగర్వంగా అందుకున్న చోటే.. క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు కింగ్ కోహ్లి వశమైంది. ముందుగా వన్డేల్లో సచిన్‌ 50వ శతకం రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ... ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2003లో క్రికెట్‌ గాడ్‌ 673 పరుగలు చేయగా... భారత్‌ వేదికగా 2023 ప్రపంచకప్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 711 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆడిన పది ఇన్నింగ్సుల్లో విరాట్‌ మూడు సెంచరీలు, అయిదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ ఇప్పటికే 711 పరుగులు చేసి సత్తా చాటాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి సత్తా చాటాడు. 

 

అలాగే ఈ ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో ఏడు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు అయిదు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.