ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలర్లు చెలరేగిపోయారు.  పాకిస్థాన్‌ ఆశలపై నీళ్లు చల్లేలా..అఫ్గాన్‌కు సెమీస్‌ ద్వారాలు మూసుకుపోయేలా శ్రీలంకను  తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఈ చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లు రాణించడంతో లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. ఈ లక్ష్యాన్ని కివీస్‌ వేగంగా ఛేదిస్తే దాదాపుగా పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారిపోయినట్లే. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లంకను కివీస్‌ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో  పాతుమ్‌ నిసంక వికెట్‌ తీసిన టిమ్ సౌథీ.. లంక వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. ఎనిమిది బంతుల్లో రెండే పరుగులు చేసిన నిసంకను సౌథీ అవుట్‌ చేశాడు. మూడు పరుగుల వద్దే లంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది.
 కుశాల్‌ మెండీస్, కుశాల్‌ పెరీరా కాసేపు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 



కానీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్‌ లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చడంతో 30 పరుగుల వద్ద లంకేయులు రెండో వికెట్‌ కోల్పోయారు. అదే ఓవర్‌ నాలుగో బంతికి ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సధీర సమరవిక్రమను కూడా బౌల్ట్‌ అవుట్‌ చేయడృంతో లంక కష్టాల్లో పడింది. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ చరిత్‌ అసలంకతో కలిసి కుశాల్ పెరీరా పోరాడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా పెరీరా ఆచితూచి ఆడాడు. కానీ ఎనిమిది బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన చరిత్‌ అసలంకను వికెట్ల ముందు బౌల్ట్‌ దొరకబుచ్చుకున్నాడు. దాంతో 70 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక... అదే స్కోరు వద్ద మరో వికెట్‌ కోల్పోయింది. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన ధాటిగా బ్యాటింగ్ చేసిన కుశాల్‌ పెరీరాను ఫెర్గ్యూసన్ అవుట్ చేశాడు. దీంతో లంక కష్టాలు మరింత పెరిగాయి.



 అయిదు వికెట్ల నష్టానికి శ్రీలంక70 పరుగులు చేయగా... అందులో 51 పరుగులు కుశాల్‌ పెరీరానే చేశాడు. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్‌, ధనుంజయ డిసిల్వా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆచితూచి ఆడిన వీరిద్దరూ లంక స్కోరును వంద పరుగులు దాటించారు. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద ఏంజెలో మాధ్యూస్ అవుట్‌ అయ్యాడు. 27 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన మాథ్యూస్‌ను శాంట్నర్ అవుట్‌ చేశాడు. స్కోరు బోర్డుపై మరో మూడు పరుగులు చేరాయో లేదో ధనుంజయ డిసిల్వా కూడా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసిన డిసిల్వాను కూడా శాంట్నర్‌ బలి తీసుకున్నాడు. చమిక కరుణ రత్నే ఆరు పరుగులకు.. దుష్మంత చమీరు ఒక్క పరుగుకే వెనుదిరగడంతో 113 పరుగులకు లంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 150 పరుగుల్లోపు ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది.  కానీ మహీష్‌ థీక్షణ ఒంటరి పోరాటం చేశాడు. థీక్షణ చాలా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశాడు.  91 బంతులు ఎదుర్కొన్న థీక్షణ 39 పరుగులు చేయడంతో లంక  46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్‌ అయింది. థీక్షణకు మధుశంక మంచి సహకారం అందించాడు. 48 బంతులు ఎదుర్కొన్న మధుశంక  19 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి వికెట్‌కు విలుపైన 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, టిమ్‌ సౌథీ 1, ఫెర్గ్యూసన్‌ 2, శాంట్నర్‌ 2 వికెట్లు తీశారు. 



 ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టాలని కివీస్ భావిస్తోంది. న్యూజిలాండ్‌ ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు ఇది పెద్ద విషయం కాకపోయినా వరుస పరాజయాలతో ఇప్పుడు కివీస్‌ సతమతమవుతోంది. కివీస్ లంకపై భారీ విజయం సాధిస్తే పాక్‌, అఫ్గాన్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమిస్తాయి.  న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బెంగళూరు వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో కివీస్ పాకిస్థాన్‌పై 400 పరుగులు చేసింది. విలియమ్సన్ మళ్లీ జట్టులో చేరడంతో బ్యాటింగ్‌ బలం మరింత పెరిగింది. రచిన్ రవీంద్ర భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. ఫిలిప్స్ విధ్వంసకరంగా ఆడుతున్నాడు. టోర్నమెంట్ ఇంగ్లండ్‌పై భారీ సెంచరీ చేసిన తర్వాత కివీస్‌ ఓపెనర్ డెవాన్ కాన్వే పెద్దగా రాణించకపోవడం కివీస్‌ను కలవరపెడుతోంది.