Yuvraj Singh's Father's Rant Against MS Dhoni Goes Viral: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.(MS Dhoni) భారత్(India) కు రెండు ప్రపంచకప్ లు అందించి.. ఎందరో యువ క్రీడాకారులను జట్టులోకి తెచ్చి భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. తాము కష్టాల్లో ఉన్న ప్రతీసారి ధోని తమకు మద్దుతుగా నిలిచాడని.. ధోనీ వల్లే తాము ఈస్థాయికి వచ్చామని చెప్పే యువ క్రికెటర్లు చాలామందే ఉన్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి యోగరాజ్(Yograj) సింగ్ మాత్రం ధోనీపై విషం చిమ్ముతూనే ఉన్నాడు. మరోసారి ధోనీపై యోగరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. ధోనీ వల్లే యువరాజ్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిందని విమర్శించాడు.

 


 

యోగరాజ్ తీవ్ర విమర్శలు 

మహేంద్ర సింగ్ ధోనీ లేకపోతే  టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరికొన్ని సంవత్సరాల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించేవాడని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. యువరాజ్ ముందుగానే రిటైర్మెంట్ కావడం వెనక ధోనీ ఉన్నాడని మండిపడ్డాడు. యువరాజ్ సింగ్ కెరీర్ త్వరగా ముగియడానికి మాజీ కెప్టెన్ ధోనీనే కారణమని.. ధోనీ తన కొడుకు క్రికెట్ కెరీర్ ను నాశనం చేశాడని యోగరాజ్ నిందించాడు. తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిన ధోనీని ఎప్పటికీ క్షమించలేనని అన్నాడు. ధోని తన కొడుకు జీవితాన్ని నాశనం చేశాడని.. లేకపోతే మరో నాలుగైదేళ్ల పాటు భారత్ జట్టుకు ఆడే సత్తా యువరాజ్ సింగ్ కు ఉందని అన్నాడు. "ఎంఎస్ ధోనిని నేను క్షమించను. అతను అద్దంలో ముఖం చూసుకోవాలి. అతను చాలా పెద్ద క్రికెటర్. కానీ అతను నా కొడుకు విషయంలో ఏం చేశాడు. ప్రతీ విషయం ఇప్పుడు బయటపడుతోంది. ఇది జీవితంలో ఎప్పటికీ క్షమించలేని విషయం." అని యువరాజ్ సింగ్ తండ్రి ఆరోపించాడు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ లాంటి కొడుకు ప్రతీ ఒక్కరికి ఉండాలని యోగరాజ్ సింగ్ అన్నాడు. యువీ లాంటి ఆటగాడు ఉండడని గతంలో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా అన్నారు.క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రపంచకప్ గెలిచినందుకు యువరాజ్కు భారతరత్న ఇవ్వాలని యోగరాజ్ అన్నారు. యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ 1981లో భారత జట్టు తరపున ఆరు వన్డేలు, ఒక టెస్ట్ ఆడాడు. 





 

క్యాన్సర్‌తో యువరాజ్ పోరాటం

2011 ప్రపంచకప్ లో యువరాజ్ భీకర ఫామ్ల లో ఉన్నాడు. టీం ఇండియా ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మైదానంలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుని సత్తా చాటాడు. అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూనే యువరాజ్ ఆ ప్రపంచకప్ ఆడాడు. మ్యాచులు ఆడుతున్న సమయంలో యువీ డ్రెస్సింగ్ రూంలో రక్తపు వాంతులు కూడా చేసుకున్నాడని సహకర క్రికెటర్లు ఇప్పటికే వెల్లడించారు. వైద్యులు యువరాజ్ ఊపిరితిత్తుల్లో ట్యూమర్‌ను కనుగొన్నారు. యువరాజ్ అమెరికాలో మూడు నెలల కీమోథెరపీ చికిత్స చేయించుకున్నాడు.అనంతరం పోరాట యోధుడిలా యువరాజ్ మళ్లీ తిరిగివచ్చాడు. ఒక సంవత్సరంలో క్యాన్సర్‌ను జయించడమే కాకుండా 2012 టీ ట్వంటీ ప్రపంచకప్ కు జట్టులోకి తిరిగివచ్చాడు.