Telangana Tigers edge out Rajasthan Legends : ఇండియన్‌ వెటరన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మొట్టమొదటి ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్‌ లెజెండ్స్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తెలంగాణ టైగర్స్‌ ఓపెనర్‌ శివ భరత్‌ కుమార్‌ సాగిరి 59 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలవడంతో తెలంగాణ భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో పర్విందర్‌ అవానా 2, సెక్కుగే ప్రసన్న, ఇషాన్‌ మల్హోత్రా, లఖ్విందర్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్‌..  172 పరుగులే చేయగలిగింది. తంగిరాల పవన్‌ కుమార్‌, తిలక్‌, ఖాద్రి తలో 2 వికెట్లు, సందీప్‌ త్యాగి ఓ వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (32), ఇషాన్‌ మల్హోత్రా (36), రాజేశ్‌ బిష్ణోయ్‌ (44) పరుగుల చేశారు. 


కెప్టెన్‌గా గేల్‌
తెలంగాణ టైగర్స్ జట్టులో క్రిస్ గేల్‌తో పాటు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రికార్డో పావెల్‌ భాగం అయ్యాడు. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోని కూడా టైగర్స్ జట్టులో సభ్యులు. ఐవీపీఎల్ టోర్నీలో వీరేందర్ సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసుఫ్ పఠాన్, హెర్షెల్ గిబ్స్ లాంటి ఎందరో మాజీలు ఆడనున్నారు. వీవీఐపీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఐవీపీఎల్లో ఆడనున్నాయి.


మొత్తం ఎన్ని జట్లు అంటే?
ఈ లీగ్‌లో మొత్తం ఆరు జ‌ట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్‌, తెలంగాణ టైగ‌ర్స్‌, రాజ‌స్థాన్ లెజెండ్స్‌, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వారియ‌ర్స్‌, ముంబై ఛాంపియ‌న్స్ జట్లు ఈ వెటరన్‌ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రతీ జట్టులో నాలుగు నుంచి ఐదుగురు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఆడనున్నారు. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌ల కోసం టికెట్‌లు త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. మ్యాచ్‌లు యూరోస్పోర్ట్ ఛానెల్, డీడీ స్పోర్ట్స్ మరియు ఫ్యాన్‌కోడ్‌లో భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.


ఇప్పటివరకూ ఎన్నంటే..
IVPL 2024 ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో తెలంగాణపై ముంబై గెలిచింది. రెండో మ్యాచ్‌లో చత్తీస్‌ఘడ్‌పై ఢిల్లీ గెలిచింది. మూడో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఉత్తర్‌ ప్రదేశ్‌ గెలుపొందాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్‌ గేల్‌, హెర్షల్‌ గిబ్స్‌, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఆడుతున్నారు.