Yashasvi jaiswal out from 4th test! : భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా(Team India)నయా సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. అసలు బజ్‌బాల్‌ ఆటంటే ఏంటో ఇంగ్లాండ్‌ జట్టుకు తెలుసొచ్చేలా చేశాడు. వన్డే తరహా ఆట తీరుతో బ్రిటీష్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్‌... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ నాలుగో టెస్ట్‌కు దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లే.

 

వెన్నునొప్పే కారణమా..?

యశస్వీ జైశ్వాల్‌ గాయం కారణంగా రాంచీ టెస్ట్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైశ్వాల్‌ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతూనే యశస్వీ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. వెన్ను నొప్పి కారణంగా మూడో రోజు ఆటలో సెంచరీ పూర్తిచేశాక రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగిన జైశ్వాల్‌.. మళ్లీ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి తన రెండో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు కూడా జైస్వాల్‌ ఆసౌక్యర్యంగా కన్పించాడు. ఈ క్రమంలో అతడికి రాంచీ టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెన్‌జ్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జైస్వాల్‌ నాలుగో టెస్ట్‌కు దూరమైతే  దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ అరంగేట్రం జరిగే అవకాశం ఉంది.

 

రోహిత్‌ ఏమన్నాడంటే....

ఇంగ్లాండ్‌ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగానే ఆడి తమను ఒత్తిడిలోకి నెట్టారని రోహిత్‌ అన్నాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని... ప్రత్యర్థి బ్యాటర్లు బజ్‌బాల్‌తో దూకుడుగా ఆడుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఉండాలని తమ బౌలర్లకు చెప్పానని రోహిత్‌ తెలిపాడు. కానీ మూడో రోజు తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారని తెలిపాడు. టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు రెండు, మూడు రోజులపైనే దృష్టి పెట్టుద్దని... చివరి రోజు వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నామని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు. 

 

రికార్డుల మోత

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. జైస్వాల్‌ తర్వాత 855 పరుగులతో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా ఉన్నాడు. టీమిండియా తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ పేరిట ఉన్న 535 పరుగుల రికార్డును 545 పరుగులతో యశస్వి జైస్వాల్‌ బద్దలు కొట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నమోదు చేశాడు.