Railways register highest successful run chase: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో సరి కొత్త రికార్డ్ నమోదైంది. రైల్వేస్(Railways) జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన జ‌ట్టుగా రైల్వేస్‌ నిలిచింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా తాజాగా త్రిపురతో రైల్వేస్ జట్టుకు మ్యాచ్ జరిగింది. ఈ పోరులో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్‌ జట్టు ఈ ఘనతను సాధించింది. 2019-2020 రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర నెలకొల్పిన రికార్డును రైల్వేస్‌ బద్దలు కొట్టింది. 2019-2020 సీజన్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త చరిత్ర సృష్టించింది.

మ్యాచ్‌ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో త్రిపురా రెండో ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి రైల్వేస్‌ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రైల్వేస్‌ 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది రైల్వేస్‌ జట్టు. అయితే 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుని లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైల్వేస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ప్రిథమ్‌ సింగ్‌(169 నాటౌట్‌),మహ్మద్‌ సైఫ్‌(106) సూపర్ సెంచరీలతో విజృంభించారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్ కు 175 పరుగులను జోడించారు. అలా వీరిద్దరి ఇన్నింగ్స్ తోడవ్వడంతో 378/5 స్కోరు సాధించింది రైల్వేస్‌ జట్టు. ఈ విజయంతో కొత్త చరిత్ర సృష్టించింది.


బెంబేలెత్తిస్తున్న పుజారా
టీమిండియా టెస్టు స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ ప్రతిష్ఠాత్మకమైన రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ సెలక్షన్‌ కమిటీకి హెచ్చరికలు పంపుతున్నాడు. తన బ్యాటింగ్‌ శైలిని పూర్తిగా మార్చేసుకున్న పుజారా బజ్‌బాల్‌ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఎంతటి ప్రమాదకర బౌలర్‌ను అయినా తన డిఫెన్స్‌తో నిస్సహాయులుగా మార్చేసే పుజారా ఇప్పుడు తన ఎటాకింగ్‌ గేమ్‌తో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.


టీ 20 తరహా బ్యాటింగ్‌
దేశవాళీ రంజీ ట్రోఫీ 2024లో పుజారా దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా ఇప్పిటికే మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజరా..తాజాగా మరో ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన సెంచరీతో సత్తా చాటాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్దంగా టీ20 తరహాలో ఆడాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ప్రస్తుత సీజన్‌లో ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన పుజారా 77 సగటుతో తో 673 పరుగులు చేశాడు.ఇందులో పుజారా మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు.  పుజారా ప్రస్తుత ఫామ్‌ను చూస్తే రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్‌ తరపున టెస్టుల్లో పుజారాకు ఘనమైన రికార్డు ఉంది. 103 టెస్టుల్లో పుజారా 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.