ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ సారథ్య శకానికి ముగిసింది. అయిదు సార్లు ముంబైని విజేతగా నిలిపిన దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా ఉన్న హార్దిక్‌ను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న ముంబై... అతడికే సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది.


రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు భగ్గుమంటున్నారు. ఎక్స్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేసేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. ఎక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలమంది ముంబైను అన్‌ఫాలో చేస్తున్నారు. ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్‌ను ఆడుతుండగానే ఎలా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు.


రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ప్రకటన వచ్చిన తర్వాత అతని సతీమణి రితికా సజ్‌దేహ్‌ తొలిసారిగా స్పందించింది. రోహిత్‌ కెప్టెన్సీని పొగుడుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన పోస్ట్‌కు రితికా సజ్‌దేహ్‌ రిప్లై ఇచ్చింది. చెన్నై పోస్ట్‌ చేసిన ధోని-రోహిత్‌ ఫొటోకు రితికా ఎల్లో కలర్ హర్ట్ ఎమోజీని  పోస్ట్ చేసింది. . దీనికి నెటిజన్ల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. రితికా చేసిన కామెంట్‌ను 60 వేలమందికిపైగా లైక్ చేశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు రోహిత్‌ను కెప్టెన్‌ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ముంబయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలను కొనియాడుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీట్‌ చేసింది. 2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా రోహిత్‌ నిలిచాడని కొనియాడింది. రోహిత్‌.. మీద తమకు చాలా గౌరవం ఉందని పేర్కొంటూ ధోనీ-రోహిత్‌ ఫొటోను CSK షేర్‌ చేసింది.ఈ పోస్ట్‌కు రితికా రిప్లై ఇచ్చింది. 


రోహిత్ కెప్టెన్సీపై ముంబయి చేసిన ప్రత్యేక ట్వీట్‌ వైరల్‌గా మారింది. 2013లో రోహిత్‌ ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తమను ఒక్కటే అడిగాడని...తమ మీద నమ్మకం ఉంచాలని చెప్పాడని ట్వీట్‌లో ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ గుర్తు చేసుకుంది. గెలుపైనా.. ఓటమైనా నవ్వుతూ ఉండాలని చెప్పావని... పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో ఆరు ట్రోఫీలు సాధించావని... దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావని... ముంబై ఇండియన్స్‌ ఆ ట్వీట్‌ రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ ముంబయి ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 


గత రెండేళ్లుగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ముంబై యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్‌ పంచుకుంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ను హార్దిక్‌ నడిపిస్తాడని ఫ్రాంఛైజీ ప్రకటించింది. రోహిత్‌ సారథ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ గెలిచింది. 2013లో ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా చెన్నైతో కలిసి ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇది కేవలం రోహిత్‌ శర్మ వల్లనే సాధ్యమైంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబయికి రోహిత్‌ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా మొత్తం 163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. నాలుగు టై అయ్యాయి. మరోవైపు 2015లో ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి 2021 వరకు ముంబయితోనే ఆడిన హార్దిక్‌.. 2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌ అయ్యాడు. ఆ ఏడాది ట్రోఫీ గెలిచిన జట్టు ఈ సారి రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల హార్దిక్‌ తిరిగి ముంబయి గూటికే చేరాడు. .