Kolkata T20i: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో బుధవారం ప్రారంభమైన తొలి టీ20లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కాస్త హెవీగా ఉండటంతో బ్యాటింగ్కు రెండో ఇన్నింగ్స్లో అనుకూలంగా ఉంటుందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మరోవైపు టాస్ ఓడిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ కూడా తను కూడా ముందుగా బౌలింగ్ చేయాలని భావించాడు. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ మైదానం ఐపీఎల్లో భారత ప్లేయర్లు రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్లకు హోమ్ గ్రౌండ్ లాంటిది. గతంలో ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఇక్కడ ఎన్నో మ్యాచ్లు ఆడారు. దీంతో ఈ మైదానం వారికి కొట్టిన పిండిలాంటింది. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్గా గతేడాది వ్యవహరించి, కేకేఆర్ కప్పు గెలవడంలో భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ మ్యాచ్లో గెలుపునకై ఎలాంటి ప్రణాళికలను గంభీర్ రచించాడో అని భారత అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
షమీకి షాక్..
కొంతమంది ప్లేయర్లకు ఈ సిరీస్ పునరాగమనం కానుంది. ముఖ్యంగా ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి వెటరన్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయాలని భావించినా, తొలి టీ20లో అతనికి చోటు దక్కలేదు. వందశాతం ఫిట్ గా లేకపోవడంతో అతడిని ఈ మ్యాచ్లో అతనికి చోటు దక్కలేదని తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన షమీ.. ఈ మ్యాచ్కు ముందు ఫిట్గా మారి జట్టులోకి వచ్చాడు. అయితే వివిధ కారణాల వల్ల అతనికి చోటు దక్కలేదు. అలాగే సీనియర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతేడాది చివర్లో ప్రపంచరికార్డు స్కోర్లతో సౌతాఫ్రికాను బెంబేలెత్తించిన సూర్యకుమార్ సేన.. ఈ మ్యాచ్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా పటిష్టంగా ఉంది.
దూకుడైన ఆటతీరు..
గత కొంతకాలంగా ఏ ఫార్మాటైనా దుకూడుగా ఆడటం ఇంగ్లాండ్ అలవాటు చేసుకోంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నాయకత్వంతో బజ్ బాల్ తో ప్రత్యర్థులను వణికిస్తోంది. చివరి వరుస వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఇంగ్లాండ్ సొంతం. ముఖ్యంగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హరీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్ లాంటి హిటర్లతో జట్టు బాగా పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని వివిధ టీ20 టోర్నీలో ఈ ఆటగాళ్లు ఆడుతున్నారు. బౌలింగ్ లో గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లతో పటిష్టంగా ఉంది. మంగళవారమే తుది జట్టును ఇంగ్లాండ్ ప్రకటించి ప్రకంపనలు రేపింది. ఆద్యంతం ఫియర్లెస్ క్రికెట్ ఆడటమే తమ టార్గెటని ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ బట్లర్ ప్రకటించాడు. ఈ మ్యాచ్ లో గెలిచి ఐదు టీ20ల సిరీస్ లో శుభారంభం చేయాలని భావిస్తున్నాడు. అలాగే గతేడాది టీ20 ప్రపంచకప్ సెమీస్ లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
భారత జట్టు (తుది జట్టు): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ లెవన్): జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.