Team India News: కొత్త సంవత్సరం టీ20 పోరాటాన్ని సొంతగడ్డపై టీమిండియా మొదలు పెట్టనుంది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ ఇంగ్లాండ్ తో బుధవారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది. సొంతగడ్డ అనుకూలత కలిసి వచ్చి, ఈ మ్యాచ్ లో గెలవాలని టీమిండియా కోరుకుంటోంది. జనవరి తొలివారంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఓటమితో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలుపు గుర్రాన్ని ఎక్కాలని భావిస్తోంది. ఇక ఈ ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరుజట్ల మద్య ఇప్పటివరకు 24 మ్యాచ్ లు ఆడితే 13 సార్లు భారత్ గెలుపొందగా, 11 సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించింది. చివరి ఏడు టీ20ల్లో ఐదింటిని భారత్ కైవసం చేసుకోవడం విశేషం. చివరిసారిగా ఇరుజట్లు గతేడాది వెస్టిండీస్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్ లో తలపడగా, ఆ మ్యాచ్ లో టీమిండియా భారీ విజయాన్ని సాధించి, అదే జోరులో కప్పును కైవసం చేసుకుంది.
షమీ పునరాగమనం..
ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి వెటరన్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన షమీ.. ఈ మ్యాచ్ కు ముందు ఫిట్ గా మారి జట్టులోకి వచ్చాడు. అలాగే సీనియర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతేడాది చివర్లో ప్రపంచరికార్డు స్కోర్లతో సౌతాఫ్రికాను బెంబేలెత్తించిన సూర్యకుమార్ సేన.. ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగా మారింది. బ్యాటింగ్ కు ఈ వికెట్ స్వర్గధామం కాబట్టి, హిటర్లకే జట్టులో చోటు దక్కే అవకాశముంది. తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి తుదిజట్టులో చోటు దక్కించుకుంటారో లేదో చూడాలి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా పటిష్టంగా ఉంది.
దూకుడైన ఆటతీరు..
గత కొంతకాలంగా ఏ ఫార్మాటైనా దుకూడుగా ఆడటం ఇంగ్లాండ్ అలవాటు చేసుకోంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నాయకత్వంతో బజ్ బాల్ తో ప్రత్యర్థులను వణికిస్తోంది. చివరి వరుస వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఇంగ్లాండ్ సొంతం. ముఖ్యంగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హరీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్ లాంటి హిటర్లతో జట్టు బాగా పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని వివిధ టీ20 టోర్నీలో ఈ ఆటగాళ్లు ఆడుతున్నారు. బౌలింగ్ లో గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లతో పటిష్టంగా ఉంది.
మంగళవారమే తుది జట్టును ఇంగ్లాండ్ ప్రకటించి ప్రకంపనలు రేపింది. ఆద్యంతం ఫియర్లెస్ క్రికెట్ ఆడటమే తమ టార్గెటని ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ బట్లర్ ప్రకటించాడు. ఈ మ్యాచ్ లో గెలిచి ఐదు టీ20ల సిరీస్ లో శుభారంభం చేయాలని భావిస్తున్నాడు. అలాగే ప్రపంచకప్ లో గతేడాది ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 6.30 గంటలకు టాస్ వేస్తారు. 6 గంటల నుంచే ఈ మ్యాచ్ ను టీవీలో స్టార్ స్పోర్ట్స్, ఓటీటీలో డీస్నీప్లస్ హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
భారత జట్టు (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి/రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ లెవన్): జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Also Read: England VS India: కాళీ టెంపుల్ ను దర్శించుకున్న గంభీర్.. తనకు అచ్చొచ్చిన కోల్కతాలో విజయంపై గురి