ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయి.. సిరీస్‌ను కోల్పోయిన భారత మహిళల జట్టుకు ఓ ఓదార్పు విజయం దక్కింది. నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో బ్రిటీష్‌ జట్టుపై టీమిండియా మహిళల జట్టు సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్ బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా... తర్వాత లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను 2-1తో ముగించింది. తొలి రెండు మ్యాచుల్లో పరాజయానికి ఈ మ్యాచ్‌లు గెలిచి భారత మహిళలు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది.  అనంతరం భారత్‌ 19 ఓవర్లలో 130/5 స్కోరు చేసి గెలిచింది. 



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్‌లోనే బ్రిటీష్‌ జట్టుకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌ మూడో బంతికే రేణుకా సింగ్‌.. మైయా బౌచిర్‌ను బౌల్డ్‌ చేసి టీమిండియాకు శుభారంభం ఇచ్చింది. దీంతో ఒక్క పరుగుకే ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 24 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. పేసర్లు రేణుక, అమన్‌జోత్‌.. స్పిన్నర్లు ఇషాక్‌, శ్రేయాంక కలిసి మందకొడి పిచ్‌పై ప్రత్యర్థి పనిపట్టారు. కొత్తబంతితో అదరగొట్టిన రేణుక వరుస ఓవర్లలో ఓపెనర్లను వెనక్కిపంపింది. ఇషాక్‌ వస్తూనే ఏడు పరుగులు చేసిన కాప్సీను అవుట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ పవర్‌ప్లే ముగిసే సరికే 32 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ హెథర్‌ నైట్‌ (52) హాఫ్‌ సెంచరీ చేయగా, అమీ జోన్స్‌ (25), చార్లీ డీన్‌ (16 నాటౌట్‌) రాణించారు. అమీ జోన్స్‌తో కలిసి హెదర్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఈ ఇద్దరూ కాస్త దూకుడు ప్రదర్శించారు. కానీ ఇషాక్‌ వరుస బంతుల్లో జోన్స్‌, గిబ్సన్‌ (0)ను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాతి ఓవర్లో శ్రేయాంక వరుస బంతుల్లో హీత్‌ (1), కెంప్‌ (0)ను పెవిలియన్‌కు చేర్చింది. దీంతో 15 ఓవర్లకు 76 పరుగులకే ఇంగ్లాండ్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి వంద పరుగుల్లోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. కానీ పట్టుదలతో క్రీజులో నిలబడ్డ హెదర్‌ ఆఖర్లో వేగం పెంచింది. డీన్‌ సహకారంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. దీంతో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రేయాంక పాటిల్‌ 3, సైకా ఇషాక్‌ 3, రేణుక సింగ్‌ 2, అమన్‌జోత్‌ కౌర్‌ 2 వికెట్లు తీసి సత్తాచాటారు. 



 ఇంగ్లాండ్‌ విధించిన 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కష్టమైన పిచ్‌పై లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడింది. ఆరంభంలోనే ఆరు పరుగులు చేసిన షఫాలీ వికెట్‌ను కోల్పోయినా..జెమీమా, మంధాన దూకుడుగా ఆడారు. దీంతో పవర్‌ ప్లేను భారత్‌ 31/1తో ముగించింది. ఇక, 55 బంతుల్లోనే 57 పరుగులు జోడించి పురోగమిస్తున్న ఈ జోడీని 12వ ఓవర్లో రోడ్రిగ్స్‌ను ఎల్బీచేయడం ద్వారా డీన్‌ విడదీసింది.  మంధాన, జెమీమాసింగిల్స్‌ తీస్తూనే, వీలైనప్పుడు బౌండరీలు సాధించారు. ముఖ్యంగా జెమీమా క్రీజులో సౌకర్యంగా కదులుతూ ఫోర్లు కొట్టింది. విజయ సమీకరణం 42 బంతుల్లో 57గా మారింది. ఆ దశలో మంధాన, దీప్తి (12) కలిసి చెరో రెండు ఫోర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో 23 పరుగులు రావడం భారత్‌కు కలిసొచ్చింది. కానీ వరుస ఓవర్లలో వీళ్లిద్దరూ పెవిలియన్‌ చేరడంతో ఆఖర్లో కాస్త ఉత్కంఠ. 12 బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో రిచా కూడా నిష్క్రమించింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన అమన్‌జోత్‌ మూడు ఫోర్లతో పని పూర్తిచేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హెదర్‌ నైట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌సగా బ్రంట్‌ నిలిచారు.