ముంబై(Mumbai) వేదికగా భారత్‌(Bharat)తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా(Austrelia) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా(Team India) 282 పరుగుల భారీ స్కోరు చేసినా అది ఆస్ట్రేలియాకు సరిపోలేదు. ఏకంగా ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్ధ శతకాలతో చెలరేగడంతో కంగారు జట్టు.... సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 

 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. 12 పరుగుల వద్ద షెఫాలీ వర్మ వికెట్‌ను భారత్‌ కోల్పోయింది. అయిదు బంతుల్లో ఒక్క పరుగు చేసిన షెఫాలీని బ్రౌన్‌ బౌల్డ్‌ చేసి టీమిండియాకు తొలి షాక్‌ ఇచ్చింది. మరో ఓపెనర్‌ యాస్తికా బాటియా సమయోచితంగా ఆడింది. 64 బంతుల్లో ఏడు ఫోర్లతో 49 పరుగులు చేసింది. అర్థ శతకాన్ని ఒక్క పరుగు ముందు యాస్తికా అవుటై నిరాశ పరిచింది. అనంతరం రిచా ఘోష్‌ 20 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటైంది. తొమ్మిది పరుగులు చేసి కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా అవుటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. కానీ జెమిమా రోడ్రిగ్స్‌ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను అదుకుంది. కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లతో 82 పరుగులు చేసింది. ఆల్‌రౌండ‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్ 62 నాటౌట్ అర్ధ శ‌త‌కంతో చెలరేగింది. రోడ్రిగ్స్‌, వస్త్రాకర్‌ రాణించడంతో భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు బాదింది. కంగారూ బౌల‌ర్లలో అషే గార్డ్‌న‌ర్, వ‌రేహ‌మ్ త‌లా రెండు వికెట్లు తీశారు.

 

ముగ్గురు బ్యాటర్ల హాఫ్‌ సెంచరీలు

అనంతరం 283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులకు ఆదిలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌ మూడో బంతికే రేణుకా సింగ్‌.. హీలీని అవుట్‌ చేసింది. మూడు బంతుల్లో డకౌట్‌గా హీలీ అవుటైంది. ఈ ఆనందం భారత్‌కు ఎక్కువసేపు నిలువలేదు.  లిచ్‌ఫీల్డ్, ఎలిస్‌ పెర్రీ భారీ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. లిచ్‌ఫీల్డ్ 89 బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్సుతో 78 పరుగులు చేసి అవుటవ్వగా... ఎలిస్‌ పెర్రీ 72 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి అవుటైంది. వీళ్లు రెండో వికెట్‌కు 148 ప‌రుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఆల్‌రౌండ‌ర్ త‌హ్లియా మెక్‌గ్రాత్ (68) కూడా హాఫ్ సెంచ‌రీతో మెరిసింది. వీరి దూకుడు ముందు టీమిండియా బౌలర్లు తేలిపోయారు. అనంత‌రం బేత్ మూనీ(42) జ‌ట్టును విజ‌యం వైపు నడిపించింది. 

 

ఏకంగా ముగ్గురు ఆసిర్‌ బ్యాట‌ర్లు హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కడంతో 6 వికెట్ల తేడాతో హ‌ర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) సేనను ఓడించింది. భార‌త్ నిర్దేశించిన 283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆసీస్ భారీ టార్గెట్‌ను 46.3 ఓవ‌ర్లలోనే ఛేదించింది. రికార్డుల ప‌రంగా చూస్తే.. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక ఛేద‌న కావ‌డం విశేషం. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. భారీ స్కోరు చేసినా ఓడిపోవడం టీమిండియాను తీవ్రంగా నిరాశపరిచింది. రెండో వన్డేలో అయినా గెలిచి సిరీస్‌ను సమయం చేసి కీలకమైన మూడో వన్డేకు సిరీస్‌ను తీసుకెళ్లాలని భారత మహిళలు భావిస్తున్నారు.