T20 World Cup 2024 : క్రికెట్‌ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న దాయాదులు సమరానికి వేదిక ఫిక్స్‌ అయింది. దాయాదుల పోరు అంటే క్రికెట్‌ అభిమానులకు ఎంతో మజా వస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భారత్‌, పాక్‌ జట్ల అభిమానులతోపాటు క్రికెట్‌ అభిమానులు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరే జట్లు ఆడే మ్యాచ్‌కు లేనంత క్రేజ్‌ ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్‌కు ఉంటుంది. అందుకే క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తుంటారు.


టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కూడా ఈ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. భారత్‌, పాక్‌ జట్లు ఎక్కడ తలపడబోతున్నాయన్న ప్రశ్న క్రికెట్‌ అభిమానులను ఆసక్తి కలిగిస్తోంది.  ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. జూన్‌ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు న్యూయార్‌ వేదికగా తలపడనున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌కు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియం అతిథ్యమివ్వబోతోంది. టీ20 వరల్డ్‌ కప్‌ను వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా  జట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించిన అవకాశాన్ని అమెరికాకు ఐసీసీ అప్పగించింది. ఇందుకోసం అమెరికా భారీ ఎత్తున స్టేడియాన్ని నిర్మించింది. ఈ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసిన అమెరికా క్రికెట్‌ కౌన్సిల్‌.. 34000 మంది క్రికెట్‌ అభిమానులు వీక్షించేలా నిర్మాణం చేపట్టింది.


పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా..?


న్యూయార్క్‌ వేదికగా భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ జూన్‌ తొమ్మిదో తేదీన జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 8 గటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. న్యూయార్క్‌లో భారత్‌, పాకిస్థాన్‌ దేశాలకు చెందిన సుమారు 8 లక్షల మంది ప్రజలు న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పెద్ద మొత్తంలో టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ స్టేడియంలో భారత్‌, పాక్‌ మధ్య జరిగే మ్యాచ్‌ రెండోది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు ముందు ఇదే స్టేడియంలో జూన్‌ మూడో తేదీన శ్రీలంక, దక్షిణాప్రికా జట్లు, జూన్‌ ఐదో తేదీన భారత్‌, ఐర్లాండ్‌ జట్లు, జూన్‌ ఏడో తేదీన కెనడా, ఐర్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా..? బౌలింగ్‌కు సహకరిస్తుందా..? అన్నది ఈ మ్యాచ్‌కు ముందు పిచ్‌ రిపోర్ట్‌ను బట్టి, ఆయా మ్యాచ్‌లు ఫలితాన్ని బట్టి తేలనుంది. పచ్చిక అధికంగా ఉండడం వల్ల బౌలర్లకు పిచ్‌ నుంచి సహకారం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..!


దాయాది జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ ఫలితాలను చూస్తే.. టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రికార్డు భారత్‌ జట్టుకే ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 12 సార్లు తలపడగా, భారత్‌ తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ జట్టు మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఈసారి కూడా భారత్‌ జట్టుదే పైచేయిగా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్‌ జట్టు కూడా బలంగా ఉండడం, బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉండడం కొంత వరకు ఆ జట్టుకు సానుకూల అంశాలుగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా వరల్డ్‌ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడుతున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లు అంతా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. దీంతో వరల్డ్‌ కప్‌పై భారత అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. సీనియర్‌, జూనియర్ల కలబోతతో ఈసారి భారత్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది.