భారత మహిళల జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన  మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన బ్రిటీష్ మహిళల జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని హర్మన్‌ ప్రీత్‌ బృందం భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్‌కు అడ్డుకట్ట వేయడం టీమ్‌ఇండియాకు అంత తేలికేం కాదు.  లింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో విశేషంగా రాణిస్తేనే ఇంగ్లాండ్‌కు భారత మహిళల జట్టు పోటీనిచ్చే అవకాశం ఉంది. భారత గడ్డపై జరిగే సిరీస్‌ల్లో ఇంగ్లండ్‌ జట్టు అమోఘంగా రాణిస్తుంటుంది. ఇక్కడ 10 మ్యాచ్‌లు ఆడితే ఎనిమిదింట్లో బ్రిటీష్‌ మహిళల జట్టు విజయం సాధించింది. 2006 తర్వాత ఇంగ్లండ్‌పై భారత జట్టుకు టీ20 సిరీసే దక్కలేదు. తొలి టీ20లో యువ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌, సైకా ఇషాక్‌ ఆకట్టుకున్నారు. పేసర్‌ రేణుక సింగ్‌ కూడా సత్తా చాటింది. 


అయితే తొలి మ్యాచ్‌లో ఎక్కువ ఫుల్‌టాస్‌లు వేసిన భారత బౌలర్లు.. ఈ తప్పును దిద్దుకోవాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక చతికిలపడింది. భారత్‌ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా, ఇంగ్లండ్‌ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించారు. ఒక్క పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ మాత్రమే అద్భుతంగా రాణించి తొలి ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు తీసింది. కానీ మిగతా బౌలర్లు కట్టడి చేయలేకపోవడంతో జట్టు మూల్యం చెల్లించుకుంది. దీనికితోడు డానీ వయెట్‌, నాట్‌ సివర్‌ బ్రంట్‌ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు అందుకోలేకపోవడం కూడా దెబ్బతీసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ షెఫాలీవర్మ అర్ధసెంచరీ మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. వీళ్లిద్దరితో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కూడా అదరగొడితే ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టమేం కాదు. ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌ హెదర్‌ నైట్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌, నాట్‌ సీవర్‌, కీపర్‌ అమీ జోన్స్‌ కీలకంగా మారనున్నారు.



 భార‌త(India) ప‌ర్యట‌న‌లో ఇంగ్లాండ్(England) మ‌హిళ జ‌ట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో 38 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 198 పరుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త మహిళల జ‌ట్టు 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 38 పరుగుల తేడాతో తొలి టీ 20లో బ్రిటీష్‌ మహిళల జట్టు విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయలేకపోయిన భారత బౌలర్లు... బ్యాటింగ్‌లోనూ ఏ దశలోనూ లక్ష్యాన్ని సాధించేలా కనిపించలేదు. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. షెఫాలి వర్మ తప్ప మిగిలిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో టీమిండియా విజయానికి 38 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంథాన భారత్‌కు శుభారంభాన్ని అందించలేదు.