IND vs PAK T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి సూపర్ 12 మ్యాచ్‌ ఆడుతోంది. మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్థాన్‌తో తలపడుతోంది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. జట్టులో ఏడుగురు బ్యాటర్లు, ఒక ఆల్‌రౌండర్‌, ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నామని తెలిపాడు. పిచ్‌ చాలా బాగుందని, పచ్చిక ఉందని, మబ్బులు ఉండటంతో బంతి స్వింగ్‌ అవుతుందని అంచనా వేశాడు.


భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌


పాకిస్థాన్‌: మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజామ్‌, షాన్‌ మసూద్‌, షాబాద్‌ ఖాన్‌, హైదర్‌ అలీ, ఇఫ్తికార్‌ అహ్మద్‌, మహ్మద్‌ నవాజ్‌, అసిఫ్ అలీ, షాహిన్‌ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రౌఫ్‌


యాష్ ఎందుకంటే?


టీమ్‌ఇండియా యుజ్వేంద్ర చాహల్‌ బదులు రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకోవడం క్రేజీగా అనిపిస్తోంది. ఇందుకు ఓ కారణం ఉంది. దాదాపుగా పాకిస్థాన్‌ బ్యాటింగ్‌లో ఇద్దరే కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లే ఓపెనర్లు బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌. అనూహ్యంగా వీరిద్దరికీ ఆఫ్‌ స్పిన్‌లో మంచి రికార్డు లేదు. స్ట్రైక్‌రేట్‌ తక్కువ. 110 స్ట్రైక్‌రేట్‌ మాత్రమే ఉంది. బ్యాటింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడతారు. బాబర్‌ అయితే ఆఫ్‌ స్పిన్‌లో 35 బంతులాడి నాలుగుసార్లు ఔటయ్యాడు.


వరుణుడు ఏం చేస్తాడో?


లానినా కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వర్షాలు పడుతున్నాయి. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఇందువల్లే రద్దైంది! మెల్‌బోర్న్‌లోనూ గత రెండు రోజులుగా వానలు పడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఆదివారం వరుణుడు ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు!


తాజా సమాచారం ఏంటంటే మెల్‌బోర్న్‌లో ఆదివారం వర్షం కురిసే అవకాశం తక్కువే! మూడు రోజుల క్రితం 95 శాతం వరకు వర్షం పడుతుందన్న అంచనాలు ఉండగా ఇప్పుడు 25 శాతానికి తగ్గిపోయాయి. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందని, తీవ్రంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి వర్షం కురిసేందుకు 5 శాతమే అవకాశం ఉందని పేర్కొంది.


మేం సిద్ధం!


వాతావరణం ఎలాగున్నా ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంటున్నాడు. 'కొన్ని రోజులుగా మెల్‌బోర్న్‌ వాతావరణం గురించి వింటున్నాను. అప్పటికీ ఇప్పటికీ మెరుగుదల కనిపిస్తోంది. ఉదయం నిద్రలేచి హోటల్‌ గది తెరలు పక్కకు తొలగించగానే చాలా భవంతులు మబ్బుల మధ్యే కనిపించాయి. ఇప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆదివారం ఏం జరుగుతుందో తెలియదు. మా చేతుల్లో ఉన్నవాటినే మేం నియంత్రిస్తాం. శనివారం బాగా ప్రాక్టీస్‌ చేశాం. పూర్తి ఓవర్ల మ్యాచ్‌ జరుగుతందనే ఆశిస్తున్నా' అని వెల్లడించాడు. పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు.