నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించారు. టీమిండియా ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. దీంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది.


భారత బ్యాటర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్: 59 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్: 62 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు. నేపాల్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (58: 97 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో సోమ్‌పాల్ కామీ (48: 56 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు.


వికెట్ పడకుండానే...
మొదట భారత్ 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. భారత ఓపెనర్లు కూడా మొదటి బంతి నుంచే వేగంగా ఆడటం ప్రారంభించారు. 2.1 ఓవర్లలో 17 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది. చాలా సేపు ఆట ఆగింది. దాదాపు రెండు గంటల తర్వాత వర్షం తెరిపినివ్వడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. లక్ష్యాన్ని 145 పరుగులుగా నిర్దేశించారు.


భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్: 62 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (74 నాటౌట్: 59 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) ఎక్కడా తడబడలేదు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వరుస విరామాల్లో సిక్సర్లు కొడుతూనే ఉన్నారు. మొదట రోహిత్ శర్మ 39 బంతుల్లో, తర్వాత శుభ్‌మన్ గిల్ 47 బంతుల్లో అర్థ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత కూడా ఎక్కడా తడబడలేదు. వికెట్ పడకుండానే లక్ష్యాన్ని ఛేదించారు.


మంచి స్కోరు సాధించిన నేపాల్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.  కానీ ఆరంభంలోనే నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన మూడు క్యాచుల్ని భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఇంకేముంది నేపాలీలకు అమేజింగ్‌ ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్‌ లభించింది. షమి వేసిన ఇన్నింగ్స్‌ ఆరో బంతికి కుశాల్‌ స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌ వదిలేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన రెండో ఓవర్లో ఆసిఫ్ ఔటవ్వాల్సింది. షార్ట్‌పిచ్‌ వద్ద కోహ్లీ ఈ సిట్టర్‌ను నేలపాలు చేశాడు. మళ్లీ షమి వేసిన ఐదో ఓవర్లో భూర్తెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్‌ మిస్‌ జడ్జ్‌ చేశాడు.  దొరికిన అవకాశాలను వీరిద్దరూ సద్వినియోగం చేసుకున్నారు. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం అందించారు. పదో ఓవర్లో గానీ టీమ్ఇండియాకు తొలి వికెట్‌ దొరకలేదు.


మొత్తానికి 9.5వ బంతికి కుశాల్‌ను శార్దూల్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వరుసగా భీమ్‌ షాక్రి (7), రోహిత్‌ పౌడెల్‌ (5), కుశాల్‌ (2)ను పెవిలియన్‌కు పంపించాడు. ఈ సిచ్యువేషన్లో గుల్షన్‌ ఝా (23; 35 బంతుల్లో 3x4), దీపేంద్ర సింగ్‌ (29; 25 బంతుల్లో 3x4) ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాకైనా వికెట్ల పతనం మొదలవుతుందని ఆశిస్తే.. వరుణుడు ఎంటరయ్యాడు. వర్షం కురిపించి గంటన్నర పాటు అంతరాయం కలిగించాడు. తిరిగి ఆట మొదలయ్యాక సోంపాల్‌ కామీ ఆడిన తీరు హ్యాట్సాఫ్.  టీమ్‌ఇండియా బౌలర్లను అతడు సమయోచితంగా ఎదుర్కొన్నాడు.


దీపేంద్రతో కలిసి సింగిల్స్‌ తీస్తూ ఆరో వికెట్‌కు 56 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 194 వద్ద దీపేంద్రను పాండ్య ఔట్‌ చేశాడు. ఆ తర్వాత సందీప్‌ లామిచాన్‌ (9)తో కలిసి ఏడో వికెట్‌కు 37 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సొగసైన బౌండరీలు, సిక్సర్లు బాది బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని 47.2వ బంతికి మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 228. మరో 2 పరుగులకే మిగిలిన ఇద్దరూ ఔటవ్వడంతో నేపాల్‌ 230కి పరిమితమైంది.