ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బ్రిటీష్ జట్టు తొలుత బౌలింగ్‌కు దిగింది. కానీ భీకర ఫామ్‌లో ఉన్న భారత టాపార్డర్‌ బ్యాటర్లను ఇంగ్లండ్‌ బౌలర్లు ఏ మాత్రం ఆపగలరో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిచి మహా సంగ్రామంలో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఏడాది కిందట జరిగిన టీ 20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఎదురైన ఓటమికి బలంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా... శుభ్‌మన్ గిల్, విరాట్‌ కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇంగ్లండ్‌పై గెలుపు పెద్ద కష్టం కాదు. శుభ్‌మన్‌ గిల్ పెద్ద స్కోర్‌ను చేయాలని పట్టుదలగా ఉన్నాడు.  శ్రేయస్ అయ్యర్, కె.ఎల్‌. రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు బ్యాటింగ్‌లో తిరుగులేని విధంగా ఉంది. బౌలింగ్‌లోనూ టీమిండియా అద్భుతాలు చేస్తోంది.

 

ఈ మ్యాచ్‌లో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. లక్నో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో హార్దిక్‌ స్థానంలో అశ్విన్‌ను తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో అవకాశం లభించింది. బుమ్రాకు తోడుగా సిరాజ్‌, షమిలు పేస్‌ బాధ్యతలు తీసుకోనుండగా.. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా స్పిన్‌ భారాన్ని మోయనున్నారు. 

 

లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలవాలని డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉంది. వరుస ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేసిన టీమిండియాకు షాక్‌ తప్పదు. కానీ ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన బ్రిటీష్‌ జట్టు... అన్నింటికి తెగించి ఆడే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అప్రతిహాత జైత్రయాత్రతో ముందుకు సాగిపోతున్న టీమిండియా.. అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది.

 

ఈ ప్రపంచకప్‌లో విజయం సాధించి సెమీస్‌కు ఏ మాత్రం అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంగ్లండ్‌ జట్టు భావిస్తోంది. బ్రిటీష్‌ జట్టుపై గెలిచి వరల్డ్‌కప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని  భారత్‌ చూస్తోంది. బజ్‌ బాల్‌ ఆటతో వన్డే ప్రపంచకప్‌, టీ 20 ప్రపంచకప్‌లను కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌.. భారత్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం స్థాయికితగ్గ ఆటను మాత్రం ప్రదర్శించలేక పోయింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంటిముఖం పట్టడం ఖాయమైనట్లే. ఇంగ్లండ్‌ బ్యాటింగ్ బలంగానే ఉంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ తమదైన రోజున ఎంత విధ్వంసం సృష్టిస్తారో క్రికెట్‌ ప్రేమికులకు తెలుసు. రూట్ కూడా రాణించాలని చూస్తున్నాడు. రీస్ తోప్లే బౌలింగ్ ఫామ్‌ ఆందుకోవాలని బ్రిటీష్‌ జట్టు కోరుకుంటోంది. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ల స్పిన్... భారత బ్యాటర్లకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. 

 

టీమిండియా ఫైనల్‌ 11: 

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్. 

 

ఇంగ్లండ్ ఫైనల్‌ 11: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మోయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్,  బెన్ స్టోక్స్,  డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ .