IND vs AUS World Cup 2023 Final:   కోటీ ఆశలతో ప్రపంచకప్‌ ఫైనల్‌కు సిద్ధమైన టీమిండియాను ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే కట్టడి చేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కంగారులు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ తక్కువ పరుగులకే పరిమితమైంది. బ్యాట్‌పైకి బంతి రాకపోవడం... పిచ్‌ నెమ్మదిగా ఉండడంతో పరుగులు రావడమే గగనమైన వేళ టీమిండియా బ్యాటర్లను ఆస్ట్రేలియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొట్టిన కంగారులు టీమిండియాను ఏ దశలోనూ భారీ స్కోరు చేయనివ్వలేదు. పటిష్టమైన బౌలింగ్‌కు తోడు ఆస్ట్రేలియా అద్భుత ఫీల్డింగ్‌ కూడా పరుగులు రాకుండా అడ్డుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. ఇక టీమిండియా భారమంతా బౌలర్లపైనే ఉంది.



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు నిజం చేస్తూ కంగారు బౌలర్లు కట్టడి చేశారు. రోహిత్ శర్మ ధాటిగా ఆడినా శుభ్‌మన్‌ గిల్‌ ఆదిలోనే అవుట్ కావడంతో టీమిండియాకు షాక్‌ తగిలింది. 4.2 ఓవర్‌ వద్ద స్కోరు 30 పరుగులు ఉన్నప్పుడు 7 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన గిల్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ మరోసారి ధాటిగా ఆడాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో రోహిత్‌ విధ్వంసం సృష్టించడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కానీ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో హెడ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు రోహిత్‌శర్మ వెనుదిరిగడంతో భారత్‌ కష్టాలు మొదలయ్యాయి. కేవలం 31 బంతుల్లో 47 పరుగులు చేసి రోహిత్‌ వెనుదిరిగాడు. శ్రేయస్స్‌ అయ్యర్‌ ఇలా వచ్చి అలా అవుటైపోవడంతో భారత్‌ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. 



 పిచ్‌ నెమ్మదించడంతో బ్యాట్‌పైకి బంతి అస్సలు రాకపోవడంతో విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ఆచితూచి ఆడారు. 81 పరుగుల 148 పరుగుల వరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. విరాట్‌, రాహుల్‌ నెమ్మదించడంతో పరుగులు రావడమే గగనమైపోయింది. ఈక్రమంలో విరాట్‌ కోహ్లీ వరుసగా అయిదో అర్ద సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ క్రమంగా పరుగుల వేగం పెంచుతారనుకున్న దశలో కోహ్లీ అవుటయ్యాడు. 63 బంతుల్లో 4 ఫోర్లతో విరాట్‌ 54 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. విరాట్‌ అవుటైనా రాహుల్‌ పోరాడాడు. రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్‌ స్కోరు బోర్డును కదిలించాడు.



 ఈ క్రమంలో 22 బంతుల్లో 9 బంతులు చేసిన రవీంద్ర జడేజా హాజిల్‌వుడ‌్ బౌలింగ్‌లో కీపర్  క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాహుల్‌ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. రాహుల్‌ చివరి వరకు ఆడితే భారీ స్కోరు వస్తుందని ఆశించినా ఆ ఆశ ఫలించలేదు. 107 బంతుల్లో కేవలం ఒకే ఫోర్‌తో 66 బంతులు ఆడిన రాహుల్‌ కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్ కూడా 28 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటై టీమిండియా ఆశలపై నీళ్లు పోశాడు. కనీసం 250 పరుగులైనా చేస్తుందనుకున్న భారత్‌... ఆస్ట్రేలియా బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో 240 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3... హాజిల్‌వుడ్‌ 2, కమిన్స్‌ 2 వికెట్లు తీశారు. 



 ఇక బౌలర్లపైనే టీమిండియా భారం వేసింది. ఇప్పటికే పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండడంతో బుమ్రా, షమీ, సిరాజ్‌ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ పిచ్‌పై ఈ స్కోరును కాపాడుకోవచ్చు. అయితే రాత్రి వేళల్లో మంచుకురిసే అవకాశం ఉందన్న అనుమానం ఉంది. ఇదే భారత బౌలర్లను ఆందోళన పరుస్తోంది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తే కుల్‌దీప్‌ యాదవ్‌, జడేజాలను ఎదుర్కోవడం కష్టమే అవుతుంది. సిరాజ్‌, బుమ్రా, షమీ ఆరంభంలో వికెట్లు తీస్తే 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అవుతుంది.