IND vs ENG, WC23: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో టీమ్‌ఇండియా మొదటి సన్నాహక మ్యాచ్‌ ఆడుతోంది. శనివారం గువాహటి వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పోటీ మొదలవుతుంది. హిట్‌మ్యాన్‌ సేన ఆసీస్‌పై, జోస్‌ బట్లర్‌ టీమ్‌ న్యూజిలాండ్‌పై 2-1 తేడాతో వన్డే సిరీసులు గెలిచి ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచులో రెండు జట్లు రిజర్వు బెంచీ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.


టీమ్‌ఇండియా.. బీకేర్‌ఫుల్‌!


ప్రస్తుతానికి టీమ్‌ఇండియా కాస్త సౌకర్యంగా కనిపిస్తోంది. స్వదేశంలోనే మెగా టోర్నీ జరగడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. 2019 వన్డే ప్రపంచకప్‌ లీగు మ్యాచు, 2022 టీ20 సెమీసులో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోవడం ప్రతికూల అంశం. రాజ్‌కోట్‌లో ఆసీస్‌పై సిరీస్‌ గెలిచిన హిట్‌మ్యాన్‌ సేన ప్రత్యేక విమానంలో నేరుగా గువాహటికి చేరుకొంది. శుక్రవారం ఐచ్ఛిక శిబిరంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ సాధన చేశారు. ఆసీస్‌పై వికెట్లు తీసి మెగా టోర్నీకి ఎంపికైన యాష్‌కు తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరం. శార్దూల్‌, జస్ప్రీత్‌, షమి, సిరాజ్‌ సరైన సమయాల్లో వికెట్లు తీయడం అవసరం. ఒక్కోసారి వీరి బౌలింగ్‌లో పస కనిపించడం లేదు. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌ ఫామ్‌లో ఉన్నారు. సూర్య, ఇషాన్‌కు నిలకడ అవసరం. హార్దిక్ బ్యాటు, బంతితో రాణించాలి. శార్దూల్‌ గోల్డెన్‌ ఆర్మ్‌ అన్న పేరు నిలబెట్టుకోవాలి. స్పిన్నర్ల విషయంలో ఆందోళన లేదు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఏదేమైనా పరిస్థితులకు తగినట్టుగా జట్టు ఆడాలి. ఫీల్డింగ్‌లో అలసత్వం పనికిరాదు.


బీస్ట్‌ మోడ్‌లో ఇంగ్లాండ్‌!


డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ వన్డేల్లోనూ భీకరంగా ఆడుతోంది. టీ20కి దీనికీ పెద్ద తేడా లేనట్టుగా చితకబాదేస్తోంది. ఒకటి నుంచి పదో నంబర్‌ ఆటగాళ్ల వరకు బ్యాటింగ్‌లో దుమ్ము దులిపేస్తారు. ఇక బౌలింగ్‌లోనూ మంచి ఆప్షన్లు ఉన్నాయి. ఎటొచ్చీ స్పిన్‌ పరంగా కొంత వెనకబడింది. న్యూజిలాండ్‌ సిరీసులో 0-1తో వెనకబడిన ఆంగ్లేయులు 2-1తో సిరీస్ కైవసం చేసుకోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఆంగ్ల జట్టులో దాదాపుగా అందరికీ భారత పిచ్‌లపై అవగాహన, అనుభవం ఉన్నాయి. టాప్‌ ఆర్డర్లో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, జోరూట్‌ ఎలా ఆడతారో తెలిసిందే. రూట్‌ నిలబడ్డాడంటే ఒక పట్టాన ఔటవ్వడు. బెన్‌స్టోక్స్‌, సామ్‌ కరన్‌, లివింగ్‌స్టోన్‌, క్రిస్ వోక్స్‌, విలే, మొయిన్‌ అలీ రూపంలో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు. సూపర్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ వేసే మార్క్‌వుడ్‌తో టీమ్‌ఇండియాకు ప్రమాదం తప్పదు. ఈ నాలుగు రోజులు ఇంగ్లాండ్‌ విపరీతంగా ప్రయాణం చేయడం వల్ల ఆటగాళ్లు అలసిపోయే ప్రమాదం ఉంది.


గువాహటి పిచ్‌ రిపోర్టు: సాధారణంగా గువాహటిలో ఎక్కువ స్కోర్లు నమోదు అవుతుంటాయి. పిచ్‌ స్పిన్నర్లు, పేసర్లకు సహకరిస్తుంది. నిలబడ్డారంటే బ్యాటర్లను ఔట్‌ చేయడం కష్టం. 


భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.