Cricket World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న భారత్‌తో ఈనెల 19న బంగ్లాదేశ్‌ తలపడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు అఫ్ఘానిస్థాన్‌కు షాక్‌ ఇవ్వడంతో.. బంగ్లా ఏమైనా అద్భుతం చేస్తుందా అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భీకర ఫామ్‌లో ఉన్న భారత జట్టును బంగ్లా అడ్డుకోవడం అంత సులభం కాదని మాజీలు విశ్లేషిస్తున్నారు. అయితే గాయంతో ఇబ్బంది పడుతున్న బంగ్లా సారధి షకీబుల్‌ హసన్‌ టీమిండియాతో జరిగే మ్యాచ్‌లోకి బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే బంగ్లా అభిమానులకు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ శుభవార్త చెప్పింది.


 గాయం నుంచి బంగ్లా సారధి షకీబుల్‌ హసన్‌ కోలుకున్నాడని.. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని బంగ్లా వైద్యుడు ఖలీద్ మహమూద్ తెలిపారు. చెన్నైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ గాయపడ్డాడు. వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా షకీబ్‌కు గాయమైంది. ఈ గాయం తర్వాత కూడా షకీబ్ బ్యాటింగ్ కొనసాగించి 10 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. కానీ షకీబ్‌ గాయంతో ఇబ్బంది పడుతున్నాడని ఆ మ్యాచ్‌లోనే అభిమానులకు అర్థమైంది. షకీబ్ గాయం నుంచి కోలుకున్నాడని... ఇప్పుడు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాడని డాక్టర్ ఖలీద్ మహమూద్ తెలిపారు. షకీబ్‌కు ఇప్పుడు నొప్పి లేదని.. నెట్స్‌లో ప్రాక్టీస్‌కు కూడా సిద్ధంగా ఉన్నాడని  వివరించాడు. భారత్‌పై షకీబుల్‌ రంగంలోకి దిగడం ఖాయమని వెల్లడించాడు. మరోసారి షకీబ్‌కు స్కానింగ్‌ నిర్వహిస్తారని... దాని తర్వాత గాయాన్ని అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటామని బంగ్లా జట్టు వైద్యులు చెప్పారు. 


 బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 51 బంతులు 40 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ షకీబుల్‌ రాణించాడు. షకీబ్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేని షకీబ్ అవుట్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్‌.. ఒకదాంట్లో విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బంగ్లా గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్ 37 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలగా బంగ్లాదేశ్‌ కేవలం 34 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. రెండో మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన బంగ్లాదేశ్‌.. మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్‌ 245 పరుగులు చేయగా... కివీస్‌ సునాయసంగా ఛేదించింది.


ఇటు టీమిండియా మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఊపు మీదుంది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. చిరకాల ప్యతర్థి పాక్‌పై మూడో విజయం సాధించిన టీమిండియా ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.