Hardik-Natasa White Wedding:  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, నటి నటాషా స్టాంకోవిక్ లు ఫిబ్రవరి 14న సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ ఇంతకుముందే చట్టప్రకారం వివాహమైంది. అలాగే ఈ దంపతులకు అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. 


భారత ఆటగాడు హార్దిక్ పాండ్య, నటాషాలు గతేడాది చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2020 మే, 31న తాము వివాహం చేసుకున్నట్లు వీరిరువురూ ప్రకటించారు. జూలై 2020లో నటాషా అగస్త్యకు జన్మనిచ్చారు. అయితే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని పాండ్య, నటాషా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14ను ఎంచుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు. 'అప్పట్లో వారు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అంతా హడావిడిగా జరిగిపోయింది. తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వారికి ఎప్పట్నుంచో కోరిక ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు' అని వారు తెలిపారు. 


ఉదయ్ పూర్ లో వేడుక


నివేదికల ప్రకారం.. హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్ ల గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 16 వరకు కొనసాగనుంది. వీరి వివాహం ఉదయ్ పూర్ లో జరగనుంది. నటాషా క్రిస్టియన్ అయినందున అదే పద్ధతిలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు నిర్వహించే హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్ నుంచే వీరి వివాహానికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు నివేదిక తెలిపింది. 






పునరాగమనం సూపర్


గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు అరంగేట్రంలోనే కెప్టెన్ గా ట్రోఫీని అందించాడు. అలాగే భారత జట్టులోనూ రాణిస్తున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో ఐర్లాండ్, న్యూజిలాండ్ లతో టీ20 సిరీస్ లకు ప్రాతినిధ్యం వహించి జట్టును సిరీస్ విజేతగా నిలిపాడు. పాండ్య కెప్టెన్సీలో శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ ను 3-0తో భారత్ గెలుచుకుంది. 


కెప్టెన్ గా, ఆటగాడిగా హార్దిక్ పాండ్య ప్రదర్శనను బట్టి చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ తర్వాతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా బీసీసీఐ సూచనలు ఇచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టీ20లకు ఇకనుంచి పాండ్యనే రెగ్యులర్ కెప్టెన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. సొంతగడ్డపై కప్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగనుంది.