Kirti Azad Says Even Virat Kohli And Rohit Sharma Should Play Domestic Cricket:  ఇటీవల దేశవాళీ క్రికెట్‌(Donestic Cricket)పై చర్చ జోరుగా సాగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో ఆడడం లేదని ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై బీసీసీఐ కొరఢా ఝుళిపించిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లపై చర్చ ప్రారంభమైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో కింగ్‌ కోహ్లి(Kohli), రోహిత్‌శర్మ(Rohit Sharma) కూడా దేశవాళీ క్రికెట్లో ఆడాలని మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నాడు.  అవకాశం ఉన్నా రంజీ ట్రోఫీలో వీరు బరిలో దిగకపోవడంపై సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను బీసీసీఐ తప్పించిన నేపథ్యంలో కీర్తి ఆజాద్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. కిషన్‌, శ్రేయస్‌ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే అని మరి రోహిత్‌, కోహ్లీ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌పైనే దృష్టి పెడుతున్నారని.... రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లిలు సైతం ఖాళీ దొరికితే దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని సూచించాడు. కిషన్‌, శ్రేయస్‌లపై మాత్రమే కొరడా ఝుళిపించడం తప్పని.. నిబంధనలు మీరితే ఎవరిపైనైనా ఇలాంటి చర్యలే తీసుకోవాలి కదా అని ఆజాద్‌ నిలదీశాడు.



అనుకున్నట్లే జరిగింది.


దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), శ్రేయస్స్‌ అయ్యర్‌(Shreyas iyer)పై బీసీసీఐ(BCCI) కొరఢా ఝుళిపించింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికా(South Africa) పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన కిషన్‌ తరువాత జరిగిన ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya)తో కలసి ప్రాక్టీస్‌ చేశాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టు ఆడాలని బీసీసీఐ..హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) చెప్పినా ఇషాన్‌ కిషన్‌ వినలేదు. తరఫున అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆడాలని శ్రేయస్‌ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా A+ జాబితాలో నిలవగా రాహుల్‌, గిల్‌, సిరాజ్‌ గ్రేడ్‌ Aకు పదోన్నతి పొందారు. రిషబ్‌ పంత్‌ B గ్రేడ్‌లో ఉన్నాడు. టీ20 స్టార్‌ రింకూసింగ్, హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ కొత్తగా గ్రేడ్‌ Cలో చోటు దక్కించుకున్నారు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం మూడు టెస్టులు కాని, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే వారిని కూడా గ్రేడ్‌ C లో చేరుస్తారు. ఈ కాంట్రాక్టులు అక్టోబర్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 30, 2024 వరకు అమలులో ఉంటాయి. ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్టును బీసీసీఐ కొత్తగా సిఫార్సు చేసింది. దీనిలో ఆకాశ్‌దీప్‌, విజయ్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యశ్‌ దయాల్‌, విద్వాంత్‌ కావేరప్ప ఉన్నారు.



 గ్రేడ్ A+లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ Aలో రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. గ్రేడ్‌ Bలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారు. గ్రేడ్ సీలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్‌ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్ ఉన్నారు.