IND vs AUS 2nd Test:  దాదాపు 20 ఏళ్ల క్రితం 2004- 2005లో ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత చాలా సిరీసులు జరిగినప్పటికీ మళ్లీ మన దేశంలో ఆ జట్టు టెస్ట్ సిరీస్ విజయం సాధించలేదు. గత 2 పర్యాయాల్లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమిండియానే చేజిక్కించుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత్ లో అడుగుపెట్టింది ఆసీస్ జట్టు.


భారత్ అంటే స్పిన్ పిచ్ లే ఎదురవుతాయన్న అంచనాతో నెట్స్ లో స్పిన్ బౌలింగ్ ను విపరీతంగా ప్రాక్టీస్ చేశారు ఆ జట్టు ఆటగాళ్లు. వార్మప్ మ్యాచ్ వద్దనుకుని భారత దేశవాళీ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించుకుని స్పిన్ ను ఎదుర్కోవడం సాధన చేశారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో ఎంతగా శ్రమించినా.. అసలు టెస్టుకు వచ్చేసరికి వారి బలహీనత బయటపడిపోయింది. టీమిండియా స్పిన్నర్ల ముందు ఆసీస్ బ్యాటర్లు తలవంచక తప్పలేదు. ఫలితం నాగ్ పూర్ వేదికగా జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇప్పుడిక పోరు ఢిల్లీకి మారింది. రేపే భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్. మరి ఈ మ్యాచులోనూ గెలిచి భారత్ ఆధిక్యాన్ని పెంచుకుంటుందా.. లేదా ఇందులో విజయం సాధించి ఆసీస్ సిరీస్ ను సమం చేస్తుందా! చూడాలి. ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది


'టాప్' నిలవాలి


తొలి టెస్టులో విజయం సాధించినప్పటికీ భారత్ సరిదిద్దుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం. ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో టీమిండియా టాపార్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే రాణించాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, పుజారా, సూర్యకుమార్ యాదవ్ లు నిరాశపరిచారు. లోయరార్డర్ లో జడేజా, అక్షర్ పటేల్, షమీలు రాణించారు కాబట్టి భారత్ 400 స్కోరు చేయగలిగింది. కాబట్టి రెండో టెస్టులో టాపార్డర్ నిలవాల్సిందే. రాహుల్ ఓపికగా నిలబడ్డప్పటికీ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. స్పిన్ ను ఎదుర్కోవడంలో మంచి అనుభవమున్న పుజారా, కోహ్లీలు కూడా స్పిన్నర్ల బౌలింగ్ లోనే ఔటయ్యారు. ఇక టెస్ట్ అరంగేట్రం చేసిన సూర్యకుమార్ పరిమిత ఓవర్ల ప్రభావం నుంచి బయటకు రావాల్సి ఉంది. కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ లో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ గానూ సత్తా చాటాల్సిందే. రెండో మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించాలంటే బ్యాటర్లు తమ సత్తా మేరకు రాణించాలి. 


బౌలింగే బలం


భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగే ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్ల మైదానం కూడా స్పిన్నర్లకు సహకరిస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ మ్యాచులోనూ స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అశ్విన్, జడేజా, అక్షర్ ల త్రయం మంచి ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా జడేజా పునరాగమనంలో బంతి, బ్యాట్ తోనూ చెలరేగాడు. జడ్డూ ఇదే ఫాం కొనసాగించాలని టీం భావిస్తోంది. ఇక అశ్విన్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. వీరిద్దరూ చెలరేగితే భారత్ కు తిరుగుండదు. అక్షర్ కూడా ఆల్ రౌెండర్ గా రాణిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, షమీలు తమ పాత్ర మేరకు ఆకట్టుకుంటున్నారు. కాబట్టి బౌలింగ్ లో భారత్ కు సమస్యలేమీ లేనట్లే. 


ఆసీస్ పుంజుకుంటుందా!


సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు తొలి మ్యాచ్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్ పిచ్ పై గింగిరాలు తిరుగుతున్న బంతులను ఆడలేక విజయాన్ని భారత్ కు అప్పగించేశారు. ఈ సిరీస్ ముందు వరకు అద్భుత ఫాంలో ఉన్న ఖవాజా, లబూషేన్ లు మొదటి టెస్టులో తేలిపోయారు. వార్నర్ తన పేలవ ఫాంను కొనసాగించాడు. ఉన్నంతలో స్మిత్ ఒక్కడు భారత స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. రెన్ షా, హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీలు ప్రతిభావంతులే అయినప్పటికీ అనుభవ లేమితో విఫలమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బంతితో, బ్యాట్ తో నిరాశపరిచాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే అరంగేట్ర బౌలర్ మర్ఫీ 7 వికెట్లతో చెలరేగాడు. అయితే మరో ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఢిల్లీ పిచ్ స్పిన్ కు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్న వేళ ఆసీస్ మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏదేమైనా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ పై విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా జట్టు సమష్టిగా సత్తా చాటాలి. 


భారత్ తుది జట్టు (అంచనా)


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్. 


ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)


డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్ షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.