బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా(Jay shah)కు అరుదైన గౌరవం దక్కింది. అది అలాంటి ఇలాంటి గౌరవం కాదు. ఇప్పటివరకూ భారత క్రీడా పరిపాలన విభాగంలో ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవం జై షాకు దక్కింది. 2023 సంవత్సరానికిగాను బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్‌(Sports Business Awards 2023)గా జైషా ఎంపికయ్యాడు. జై షాకు ఈ అవార్డును కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ప్రకటించింది. స్పోర్ట్స్‌ బిజినెస్‌ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. బీసీసీఐ కార్యదర్శి జై షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, డాక్టర్‌ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలో అసాధారణ నాయకత్వం కనబర్చినందుకు గాను ఈ ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. 

 

 బీసీసీఐ కార్యదర్శిగా జైషా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో బీసీసీఐని తిరుగులేని శక్తిగా మార్చారు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించాడు. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ కూడా జై షా చొరవతోనే అమల్లోకి వచ్చింది. జైషా వల్లే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతన హక్కు లభించింది. 

 

భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ను బీసీసీఐ ఘనంగా నిర్వహించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కోటీ మంది అభిమానుల ఆశలను భగ్నం చేస్తూ స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌(World Cup) ఫైనల్లో టీమిండియా(Team India) పరాజయం పాలైంది. ఈ పరాభవం జరిగి రోజులు గడుస్తున్నా అభిమానులు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. 2023 ప్రపంచకప్‌ కథ బాధగా ముగిసింది. ఇక ఇప్పుడు అందరిదృష్టి ఐపీఎల్‌పై పడింది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం తేదీని బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది. డిసెంబర్ 19వ తేదీన ఈ వేలం జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దుబాయ్‌ వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.

 

మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌పైనా దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయివేదికగా డిసెంబర్‌ 9న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌ వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఐదు ఫ్రాంచైజీ జట్లు వేలంలో పాల్గొంటుండగా... 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గతేడాది జరిగిన WPL వేలంలో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన కళ్లు చెదిరే ధరకు ఎంపికైంది. ఆమెను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- జట్టులోకి తీసుకుంది. WPL తొలి సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన తొలి మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు సృష్టించింది.