భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే పురుషుల ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌పైనా దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయివేదికగా డిసెంబర్‌ 9న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌ వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు.  జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఐదు ఫ్రాంచైజీ జట్లు వేలంలో పాల్గొంటుండగా... 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 



 డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే తాము రిటైన్‌, రిలీజ్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఐదు ఫ్రాంచైజీలు గత సీజన్‌లో తమతో ఆడిన 60 మంది క్రికెటర్లను రిటైన్‌ చేసుకుని 29 మంది విడుదల చేశాయి. రిటైన్ చేసుకున్నవారిలో 21 మంది విదేశీ క్రికెటర్లున్నారు. వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. దిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత మంది ప్లేయర్లను విడుదల చేసింది. అలా ఐదు టీమ్‌లు మొత్తం 29 మంది క్రికెటర్లను రిలీజ్‌ చేశాయి. ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ 30 మంది ఆటగాళ్లలో 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.



ఐదు ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్‌ వాల్యూ
ఢిల్లీ క్యాపిటల్స్‌ – రూ. 2.25 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –3
గుజరాత్‌ జెయింట్స్‌ – రూ. 5.95 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –10
ముంబై ఇండియన్స్‌ రూ. 2.1 కోట్లు అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –05
రాయల్‌ ఛాలెంజర్స్‌ రూ. 3.35 కోట్లు అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –07
యూపీ వారియర్స్‌ – రూ. 4 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –05


గతేడాది జరిగిన WPL వేలంలో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన కళ్లు చెదిరే ధరకు ఎంపికైంది. ఆమెను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- జట్టులోకి తీసుకుంది. WPL తొలి సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన తొలి మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు సృష్టించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆష్లీ గార్డనర్‌ రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, స్కివర్‌ను రూ. 3.20 కోట్లకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ఇక భారత ప్లేయర్లు దీప్తి శర్మ (రూ. 2.60 కోట్లు - యూపీ వారియర్స్), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు - దిల్లీ క్యాపిటల్స్) అత్యధిక ధర పలికిన జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి టైటిల్‌ కైవసం చేసుకుంది.