ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సొంత మైదానంలో ఆఖ‌రి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డేవిడ్‌ భాయ్‌... సొంత మైదానమైన మెల్‌బోర్న్‌లో చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఈ స్టార్ ఓపెన‌ర్ భావోద్వేగానికి లోన‌య్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన అనంత‌రం పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఈ స్టార్ క్రికెటర్ భావోద్వేగానికి లోనయ్యాడు. బ్యాట్ చూపిస్తూ స్టేడియంలోని అభిమానుల‌కు అభివాదం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న ఈ దిగ్గజ బ్యాట‌ర్‌ను స్టాండ్స్‌లో కూర్చున్న ఫ్యాన్స్ లేచి నిల్చొని చ‌ప్పట్లు కొడుతూ అభినందించారు.  డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో వార్నర్ తన బ్యాటింగ్ గ్లౌజ్‌లను ఓ అభిమానికి ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట  ట్రెండ్ అవుతోంది. ఈ ఘటనలో వార్నర్‌ క్రికెట్‌ అభిమానులు ప్రశంసలతో ముచెత్తుతున్నారు. ఈ బాక్సింగ్‌ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన వార్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆరు పరుగులే చేశాడు. జనవరి 3న సిడ్నీ వేదికగా జరగనున్న ఆసీస్-పాక్ మూడో టెస్టు తర్వాత వార్నర్ ఈ సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌ను ముగించనున్నాడు. సొంత మైదాన‌మైన‌ మెల్‌బోర్న్‌లో ఈ లెఫ్ట్‌హ్యాండర్‌కు మంచి రికార్డే ఉంది. ఇక్క‌డ ఆడిన 18 ఇన్నింగ్స్‌లలో డేవిడ్ భాయ్ 50.66 స‌గ‌టుతో 912 ప‌రుగులు సాధించాడు.

 

రసవత్తరంగా రెండో టెస్ట్‌

మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌‌తో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని కంగారులు ఇప్పటికే 241 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. చేతులో మరో నాలుగు వికెట్లు ఉన్న దశలో ఆస్ట్రేలియా మరో 50కిపైగా పరుగులు సాధిస్తే పాక్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఎందుకంటే మెల్‌బోర్న్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 260కిపైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత తేలిక కాదు. 1953 నుంచి చూస్తే మెల్‌బోర్న్‌లో అత్యధిక లక్ష్య చేధన 258. అది కూడా వెస్టిండీస్ జట్టు 1961లో సాధించింది. గత అయిదు దశాబ్దాలుగా అంతకుమించిన లక్ష్యాన్ని ఏ జట్టు సాధించలేదు. 

 

రాణించిన పాక్‌ పేసర్లు

ఓవర్ నైట్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్.. 264 పరుగులకు ఆలౌటయ్యింది. రిజ్వాన్ 42 పరుగులు చేయగా.. ఆమిర్ జమాల్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షాహీన్ అఫ్రిదీ విలువైన 21 పరుగులు జోడించాడు. దీంతో 70 పరుగులకు చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.

 

అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను పాకిస్థాన్ పేసర్లు వణికించారు. షాహీన్ అఫ్రిదీ, మిర్ హమ్జా దెబ్బకు ఆసీస్ 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్మిత్‌, మార్ష్‌ కంగారు జట్టును ఆదుకున్నారు. స్టీవ్ స్మిత్ (50), మిచెల్ మార్ష్ (96) ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. 20 పరుగుల వద్ద మార్ష్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను పాకిస్థాన్ ఫీల్డర్ అబ్దుల్లా షఫీక్ చేజార్చాడు. దీనికి పాక్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. 20 పరుగుల వద్ద లభించిన జీవానాధారంతో మార్ష్‌ మరో 76 పరుగులు జోడించి సెంచరీ ముందు అవుటయ్యాడు.  ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్‌ను.. షాహీన్ అఫ్రిదీ అవుట్‌ చేశాడు. దీంతో ఆసిస్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కేరీ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.