International Olympic Committee & International Cricket Council: 2028 ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్‌లో (Los Angeles) జరగనున్నాయి. ఈ లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను (Cricket) చేర్చవచ్చని చాలా మంది భావించారు. అయితే క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ . లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కనిపించదు.


ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు (ICC) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సమాచారం అందించింది. లాస్ ఏంజెల్స్ తర్వాత 2032లో మరో ఒలింపిక్ గేమ్స్ జరగాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ (Brisbane) నగరం ఒలింపిక్స్ 2032కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పుడు క్రికెట్ అభిమానులు బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆశించవచ్చు.


ఒలింపిక్స్‌లో క్రికెట్ చరిత్ర ఏంటి? (Cricket in Olympics)
విశేషమేమిటంటే, ఇప్పటి వరకు క్రికెట్ ఆటను ఒలింపిక్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఆడారు. 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆటను చేర్చారు. అయితే ఆ తర్వాతి నుంచి ఒలింపిక్స్‌లో భాగం కావడంలో క్రికెట్ విఫలమైంది. 1900 ఒలింపిక్స్‌ పారిస్‌లో జరిగాయి. ఆ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్ జట్లు మాత్రమే క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి.


కామన్వెల్త్ క్రీడల్లో?
గతేడాది ఫిబ్రవరి నెలలో ఒలింపిక్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మొత్తంగా 28 క్రీడలను ఎంపిక చేశారు. 2028 ఒలింపిక్స్‌లో ఇక్కడ ఎంపికైన క్రీడలే భాగం కానున్నాయి. అయితే దీని తర్వాత మరో ఎనిమిది క్రీడలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. రానున్న కాలంలో ఇతర క్రీడలను కూడా చేర్చవచ్చని భావిస్తున్నారు. ఇందులో క్రికెట్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.


గత సంవత్సరం దాదాపు 24 సంవత్సరాల తర్వాత బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. అంతకు ముందు 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఆడారు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీలో భారత్‌తో సహా ఎనిమిది జట్లు చోటు దక్కించుకున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది క్రికెట్ అభిమానులుంటే.. వీరిలో 90 శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు ఐసీసీ ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను ప్రతిపాదించినప్పుడు వెల్లడించింది. అలాగే ఫార్మాట్‌ విషయానికొస్తే టీ20 లేదా టీ10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల బీసీసీఐ కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 


2024లో పారిస్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ తర్వాత నాలుగేళ్లకు 2028లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జరుగుతాయి. రెండు రోజుల క్రితం టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 23ఏళ్ల నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత భారత్ తరఫున స్వర్ణం సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ఎలాగో స్థానం దక్కలేదు కాబట్టి 2032 ఒలింపిక్స్‌లో అయినా స్థానం దక్కితే బాగుంటుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.