Asian Games 2023: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో మూడో రోజు భారత్‌కు  మరో రజతం దక్కింది. సెయిలింగ్ విభాగంగాలో  17 ఏండ్ల  అమ్మాయి   నేహా ఠాకూర్  సిల్వర్ మెడల్ నెగ్గింది. ఏసియన్ గేమ్స్ - 2023లో సెయిలింగ్‌లో భారత్‌కు ఇదే తొలి మెడల్ కావడం (మొత్తంగా 12వది) గమనార్హం.


మంగళవారం హాంగ్జౌలోని గర్ల్స్  డింగీ - ఐఎల్‌సీఏ 4 కేటగిరీలో పోటీ పడిన  నేహా..  11 రేసులలో  27 పాయింట్లు సాధించి  రెండో స్థానంలో నిలిచింది. థాయ్‌లాండ్‌కు చెందిన ఖున్‌బూంజన్  16  పాయింట్లతో  స్వర్ణం నెగ్గగా   సింగపూర్‌కు చెందిన కీరా మేరీ కార్లిల్ 28 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది.  


రైతు బిడ్డ.. 


నేహాది వ్యవసాయం కుటుంబం. మధ్యప్రదేశ్‌  లోని దేవాస్ జిల్లా హట్పిపలియా  తహసీల్ లోని  అమ్లతాజ్ ఆమె స్వగ్రామం. నేహా తండ్రి గ్రామంలో  వ్యవసాయం చేస్తూ  జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి సెయిలింగ్‌ ఆటపై ఇంట్రెస్ట్‌తో  వివిధ విభాగాలలో  తన రాష్ట్రంతో పాటు దేశం తరఫున కూడా ప్రాతినిథ్యం వహించింది. భోపాల్‌లో ఉన్న  నేషనల్ సెయిలింగ్ స్కూల్‌లో ఆమె శిక్షణ పొందుతోంది. గతేడాది మార్చిలో అబుదాభి వేదికగా  జరిగిన ఆసియన్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా  నేహా.. రితికా దంగితో కలిసి కాంస్యంతో పాటు స్వర్ణం కూడా నెగ్గింది.   అక్కడ పతకం నెగ్గడంతో ఆమె ఆసియా క్రీడలకు క్వాలిఫై అయింది. 


నేహా పతకం సాధించడంతో 19వ ఆసియా క్రీడలలో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇప్పటివరకూ భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు,   ఆరు కాంస్య పతకాలతో ఆరో స్థానంలో నిలిచింది.  చైనా 70 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా  రిపబ్లిక్ ఆఫ్ కొరియా (36), జపాన్ (21), ఉజ్బెకిస్తాన్ (15), హాంకాంగ్ (14) భారత్ కంటే ముందున్నాయి. 






ఇప్పటివరకూ భారత్‌కు వచ్చిన పతకాల (12) వివరాలు  : 


షూటింగ్ : 1 స్వర్ణం, 1 రజతం, 3 కాంస్యాలు (మొత్తం 5) 
రోయింగ్ : 2 రజతం, 3 కాంస్యం (మొత్తం 5)
క్రికెట్ : 1 స్వర్ణం 
సెయిలింగ్ : 1 రజతం 






హాకీలో ఘన విజయం.. 


పురుషుల హాకీలో  భారత జట్టు  సత్తా చాటింది. తొలిమ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్..  మంగళవారం ప్రిలిమినరీ రౌండ్  పూల్ - ఏ మ్యాచ్‌లో  16-1 తేడాతో  సింగపూర్‌పై ఘనవిజయం సాధించింది.  భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో పాటు మొత్తంగా నాలుగు గోల్స్ కొట్టాడు. మన్‌దీప్ సింగ్ మూడు.. వరుణ్ కుమార్, అభిషేక్ తలా రెండు గోల్స్  సాధించారు. ఈ విజయంతో భారత్ పూల్-ఏ లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.  భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.