Asian Games 2023: ఒలింపిక్స్  తర్వాత అంతటి భారీ స్ఠాయిలో జరిగే  ఆసియా క్రీడలకు రంగం సిద్ధమైంది.  కరోనా కారణంగా గతేడాది జరగాల్సి ఉన్న  19వ ఏసియన్ గేమ్స్‌ ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. నేటి (సెప్టెంబర్ 23) నుంచి వచ్చే నెల 8 పాటు  జరిగే ఈ మెగా టోర్నీలో ఆసియావ్యాప్తంగా 45 దేశాల  ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా  జరుగబోయే ఈ మెగా టోర్నీని  క్రీడాకారులు  2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు ముందు జరిగే ఈ క్రీడలలో సత్తా చాటి విశ్వ క్రీడలకు సిద్ధమవ్వాలని   క్రీడాకారులు భావిస్తున్నారు. 


45 దేశాలు. 61 క్రీడాంశాలు.. 


ఒలింపిక్స్ తర్వాత  దాదాపు అన్నిరకాల క్రీడలను కవర్ చేస్తూ సాగే  మెగా ఈవెంట్ ఆసియా క్రీడలు. కానీ  క్రీడాకారుల ప్రకారం చూస్తే ఒలింపిక్స్ కంటే ఈ ఏడాది  ఏషియాడ్‌లోనే  ఎక్కువ మంది పాల్గొంటున్నారు.  2021లో  టోక్యో (జపాన్) వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో సుమారు 11 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా   20‌18 ఆసియా క్రీడల్లోనే  దాదాపు  11 వేల మంది అథ్లెట్లు ప్రాతినిథ్యం వహించారు.  ప్రస్తుతం ఆ సంఖ్య మరింత పెరిగింది. ఈ ఆసియా క్రీడలలో  45 దేశాల నుంచి సుమారు 12వేలకు పైగా అథ్లెట్లు పోటీపడుతున్నారు. 40 క్రీడలకు సంబంధించి  61 క్రీడాంశాలకు ఈసారి హాంగ్జౌ వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో సుమారు 10 వేల ఐదు వందల మంది పాల్గొనే అవకాశం ఉంది. 


చైనా భారీగా.. 


స్వదేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలలో చైనా  భారీగా క్రీడాకారులకు బరిలోకి దించుతోంది. క్రికెట్ మినహా దాదాపు అన్ని ఈవెంట్లలో పోటీ పడుతున్న చైనా నుంచి ఏకంగా 886 మంది  బరిలో ఉన్నారు. మంచినీళ్లు తాగినంత ఈజీగా పతకాలు గెలుచుకునే చైనా ఈసారి స్వదేశంలో మరింత రెచ్చిపోవడం ఖాయం. ఆటగాళ్ల సంఖ్యలోనే కాదు.. పతకాల పట్టికలో  కూడా  1982 (న్యూఢిల్లీలోనే జరిగాయి)  నుంచి ఆ దేశానిదే అగ్రస్థానం. జకర్తా వేదికగా 2018లో జరిగిన ఆసియా క్రీడలలో  ఏకంగా 132 స్వర్ణాలు, 92 రజతాలు, 65 కాంస్యాలతో 289 పతకాలు సాధించిన చైనా ఇప్పటివరకూ మొత్తంగా సాధించిన పతకాలు 3,187 (ఇందులో స్వర్ణాలు 1,473). 


భారత్ టార్గెట్ 100.. 


ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ వంటి  పోటీలలో  పతకాలు సాధించడంలో విఫలమయ్యే భారత క్రీడాకారులు ఆసియా క్రీడలలో మాత్రం రెచ్చిపోతారు.  గత ఆసియా క్రీడలలో  70 (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు)   పతకాలు సాధించిన భారత్.. ప్రస్తుతం వంద పతకాలు టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నది.  గతంతో పోల్చితే  వివిధ క్రీడాంశాలలో భారత క్రీడాకారులు మెరుగయ్యారు. బాక్సింగ్,  రెజ్లింగ్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, హాకీ వంటి క్రీడలలో భారత్‌కు దండిగా పతకాలు వచ్చే అవకాశముంది.  ఈసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగం కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా 2018లో స్వర్ణం గెలిచాడు. ఇప్పుడు దానిని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ట్రాక్ అండ్ అథ్లెటిక్స్‌లో  68 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. భారత్ ఈసారి 39 క్రీడలలో 655 మంది  క్రీడాకారులను బరిలోకి దించింది.  ఈసారి క్రికెట్ కూడా యాడ్ కావడంతో  పురుషుల, స్త్రీల విభాగంలో  భారత్ స్వర్ణాలు ఆశిస్తోంది. 


టాప్ - 5లో భారత్ 


పతకాల పట్టికలో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలవని భారత్ మొత్తంగా ఈ క్రీడలలో సాధించిన పతకాలలో మాత్రం  టాప్ - 5లో ఉంది. ఆసియా క్రీడలలో భారత్  ఇప్పటివరకూ 155 స్వర్ణాలు, 158 రజతాలు, 244 కాంస్యాలు (మొత్తంగా 672) సాధించింది. చైనా (3,187), జపాన్ (3,054), సౌత్ కొరియా (2,235), ఇరాన్ (557) భారత్ కంటే ముందున్నాయి. ఇరాన్ పతకాల సంఖ్య మనకంటే తక్కువే అయినా ఆ దేశం సాధించిన స్వర్ణాలు  179. దీంతో ఆ దేశం నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 


ప్రారంభ వేడుకలు.. 


నేటి నుంచి మొదలుకాబోయే ఆసియా క్రీడలలో శనివారం భారత కాలమానం సాయంత్రం 5.30 గంటల నుంచి హాంగ్జౌలోని ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్‌లో  ప్రారంభ వేడుకలు జరుగుతాయి.  భారత పతకాదారులుగా  భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్  ఉన్నారు. 


లైవ్ చూడటమిలా.. 


- భారత్‌లో ఆసియా క్రీడలను లైవ్ ప్రసారాలను సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో వీక్షించొచ్చు. యాప్‌లో అయితే ఇవే ప్రసారాలు సోనీ లివ్ ‌లో ప్రసారమవుతాయి.