Fan Entered Into The Ground In Duleep Trophy In Anantapuram: దులీప్ ట్రోఫీ - 2024లో (Duleep Trophy) భాగంగా అనంతపురం (Anantapuram) వేదికగా శుక్రవారం జరుగుతున్న మ్యాచ్‌లో భద్రతా వైఫల్యం బయటపడింది. ఆర్టీటీ స్టేడియంలో ఇండియా సీ వర్సెస్ ఇండియా డీ మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు హాజరయ్యారు. అయితే, మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. అనంతరం మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా యువ ఓపెనర్, ఇండియా సీ టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ దగ్గరకు వెళ్లి కాళ్లకు మొక్కాడు. అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చి ఆనందంతో బయటకు వచ్చాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ అభిమాని లోపలికి ఎలా వచ్చాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


బీసీసీఐ ఆగ్రహం


ఈ ఘటనపై బీసీసీఐ (BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జాతీయ క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకమైన దేశవాలీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఇలాంటి భద్రత లోపాలు బయటపడడంపై నిలదీసినట్లు సమాచారం. పోలీసులు సరైన భద్రత కల్పించలేదా.? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ ఇలా అభిమాని క్రీడా మైదానంలోకి వచ్చి ఒక ప్లేయర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి కాళ్లు మొక్కి వెళ్లడం ఏంటని ప్రశ్నించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కాగా, ఇక్కడ మరో 15 రోజులు మ్యాచులు జరుగుతున్న తరుణంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి భద్రత ఏర్పాటు చేయాలని భద్రత సిబ్బంది, మ్యాచ్ నిర్వాహకులను బీసీసీఐ ఆదేశించింది.


Also Read: Leopard In Rajahmundry: రాజమండ్రి శివార్లులో చిరుత సంచారం-భయాందోళనలో ప్రజలు!