East Godavari News: ఏడాదిన్నర కాలం క్రితం కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది.. చివరకు అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.. ఆరు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు మండలం శివారు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం చేస్తుందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి.. ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి శివారు  లాలాచెరువు సమీపంలో దూరదర్శన్‌, ఆల్‌ఇండియా రేడియో రిలే స్టేషన్‌ ప్రాంగణంలో చిరుత పులి సంచారం చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి..


శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో పంది వెనుక మాటు వేసి వెళ్తు దానిపై దాడికి పాల్పడిన దృశ్యాలను బమ్మూరు పోలీసులకు దూరదర్శన్‌ సిబ్బంది అందజేశారు. అయితే గురువారం రాత్రి కూడా చిరుతపులికి సంబందించిన అలజడి అయితే లాలాచెరువు శివారు ప్రాంతంలో కనిపించిందని పలువురు స్థానికులు చెప్పారు..  అదే రోజు హౌసింగ్‌బోర్డు కాలనీ పుష్కరవనం వద్ద పులి ఏదో జంతువును నోట కరిచుకుని రోడ్డు దాటిందని, ఆతరువాత అది ఫారెస్ట్‌ క్వార్టర్స్‌ వైపుగా వెళ్లిందని మరికొందరు వాహనచోదకులు తెలిపారని కొందరు తెలిపారు.. అయితే దీనిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా దూరదర్శన్‌ కేంద్రం వద్ద సీసీ కెమారాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 



చిరుతపులిగా నిర్ధారించిన ఫారెస్ట్‌ అధికారులు..


రాజమండ్రి శివారు లాలాచెరువు వద్ద పులి సంచారంపై వస్తున్న వార్తల విషయంలో జిల్లా అటవీశాఖ అధికారులు నిజనిర్ధారణ చేపట్టారు.. అది సంచరించిందని చెబుతున్నవారి ద్వారా వివరాలు సేకరించి ఆపై దాని పాదముద్రల ఆనవాళ్లును గుర్తించే పనిలో నిమగ్నమయినా పూర్తిస్థాయి సమాచారం రాలేదు.. అయితే దూరదర్శన్‌ కేంద్రం వద్ద లభ్యమైన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు అక్కడ లభించిన పాదముద్రల ద్వారా అక్కడ సంచారం చేసింది చిరుత పులేనని నిర్ధారణకు వచ్చారు. 


అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
జనావాసాల వద్ద చిరుత పులి సంచారం చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు హెచ్చరించారు. పులి అడుగులను గుర్తించి అది చిరుతపులిగా గుర్తించామని వెల్లడిరచారు. దీంతో లాలాచెరువు ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు- మరో రెండు రోజులు కుండపోతే!


ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు.. 


రాజమండ్రి శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులిని గుర్తించి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటుచేశారు. పులిసంచారంపై ఓ నిర్ధారణకు వచ్చిన అధికారులు ట్రాప్‌ కెమెరాల ద్వారా దాని కదలికలను గుర్తించి ఆపై బోన్‌ ద్వారా దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈలోపు ఎక్కడైనా పులికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించినా వెంటనే సమాచారం అందివ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


రాజమండ్రికి పులిసంచారం కొత్తకాదు..


రాజమండ్రి శివారు ప్రాంతం అటవీప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఆవాసాల మధ్యకు పులుల సంచారం గతంలో కూడా చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. 2008లో స్థానిక లలితానగర్‌లోకి ఓ చిరుత పులి చొరబడి తీవ్ర అలజడి రేపింది. ఓ బాత్‌రూమ్‌లో నక్కిఉండడంతో గమనించిన స్థానికులు బాత్‌రూమ్‌ గడియపెట్టి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు. 2011లో ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ బేస్‌కాంప్లెక్స్‌ ప్రాంగణంలో ప్రవేశించిన చిరుతపులి ఓ పెంపుడుకుక్కపై దాడి చేసింది. చివరకు బోనులు ఏర్పాటుచేసి బంధించారు. ఇదే ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌లో 2018లోనూ రెండు చిరుత పులులు చొరబడగా వాటిని బోన్లు ద్వారా ఫారెస్ట్‌ అధికారులు బందించారు. ఆతరువాత సెంట్రల్‌జైలుకు సమీపంలో కూడా ఓసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. తాజాగా లాలా చెరువు సమీపప్రాంతంలో చిరుత సంచారం కలవరాన్ని రేపింది. అయితే రాజమండ్రివైపుగా వస్తున్న పులులన్నీ అడ్డతీగల అటవీప్రాంతం నుంచే దారితప్పి వస్తున్నట్లు భావిస్తున్నారు అధికారులు.. 


Also Read: పరాయి వ్యక్తితో మాట్లాడింద‌ని దారుణం, ఆ వ్యక్తితో వివాహితకు బలవంతంగా పెళ్లి!