హాకీ... మన భారతీయుల జాతీయ క్రీడ అని పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. ఇలా చదువుకోవడమే తప్ప ఈ ఆటకు అంత ప్రాధాన్యత ఇచ్చిన వారు చాలా తక్కువ. గతంలో ఒలింపిక్స్‌లో ఏ హాకీ జట్టు సాధించని మరపురాని విజయాలు మన జట్టు సొంతం. కానీ, ఆ తర్వాత ఏమైంది? ఉన్నట్టుండి మన హాకీ జట్టు పతనమవుతూ వచ్చింది. ఈ గేమ్‌ని ఎంకరేజ్ చేసిన వాళ్లు లేరు. హాకీని ఎంచుకోమని పిల్లలకు చెప్పే తల్లిదండ్రులు కరువయ్యారు. దీంతో హాకీ జట్టు పరిస్థితి ఘోరంగా తయారైంది.    


ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడ‌ల్స్ గెలిచిన చ‌రిత్ర ఉన్న మన భారత పురుషుల జట్టు... 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కి క‌నీసం అర్హ‌త కూడా సాధించలేకపోయింది. మరి కొన్ని సార్లు గ్రూప్ స్థాయి నుంచే తిరుగుముఖం. అలాంటి జట్టు ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో పతకం గెలిచే స్థాయికి చేరుకుంది. ఇది ఎలా సాధ్యమైంది. మన జట్టు సెమీఫైనల్ చేరే వరకు అసలు పట్టించుకోలేదు. సెమీఫైనల్ చేరడంతో ఒక్కసారిగా దేశమంతా హాకీ జట్టు గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. 



అండర్ డాగ్‌లా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి కాంస్య పతకాన్ని ముద్దాడింది. హోరా హోరీగా జరిగిన కాంస్య పోరులో ప్రత్యర్థి జర్మనీని ఓడించి పతకం గెలిచింది మన జట్టు. దీంతో ఒక్కసారిగా హాకీ జట్టు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒలింపిక్స్‌కి సాధించలేని స్థితిలో ఉన్న హాకీ జట్టు అదే ఒలింపిక్స్‌లో మెడ‌ల్ గెలిచే స్థాయికి ఎలా చేరింది? కొన్ని సందేహాలు మన అభిమానుల మనసులో తలెత్తాయి. ఈ విజ‌యంలో ఫీల్డ్‌లో ఆడిన ప్లేయ‌ర్స్‌కు ఎంత పాత్ర ఉందో తెర వెనుక అంత‌కంటే ఎక్కువ పాత్రే ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 






ఇంతకీ నవీన్ పట్నాయక్ ఏం చేశారు? 


ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్‌ని స్పాన్సర్ చేయడానికి స్పాన్సర్లు క్యూలు కడతారు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ క్రికెట్ ఆటగాళ్ల జెర్సీలపై తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడానికి వేలు, లక్షల కోట్లు ఇస్తారు. ఒక్క IPL చాలు క్రికెటర్ల లైఫ్ మారడానికి. వేలం పాటలోనే కోట్లు కొల్లగొడతారు. కానీ, హాకీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఈ క్రీడను స్పాన్సర్ చేయడానికి అంత తొందరగా ఎవరూ రారు. క్రికెట్‌తో పోలిస్తే హాకీకి మన దేశంలో ఏమాత్రం క్రేజ్ ఉండక‌పోవ‌డమే ప్రధాన కార‌ణం.


చాలా కాలం భారత హాకీ జట్టుకు సహారా స్పాన్సర్ షిప్ ఇచ్చింది. అయితే 2018లో స్పాన్స‌ర్‌షిప్ నుంచి స‌హారా త‌ప్పుకుంది. ఎవ‌రూ టీమ్‌ను స్పాన్స‌ర్ చేయ‌డానికి ముందుకు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో హాకీ పని అయిపోయింది అని అనుకున్నారు అంతా. కానీ, అప్పుడే ఒడిశాలోని నవీన్ ప‌ట్నాయ‌క్ స‌ర్కారు ఎవరూ సాహసించని పని చేసి హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్ల‌కుగాను హాకీని స్పాన్స‌ర్ చేయ‌డానికి స్వయంగా ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం అక్షరాల రూ.100 కోట్లతో హాకీ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇదే మ‌ళ్లీ ఇండియ‌న్ హాకీ టీమ్ తల రాత‌ను మార్చింది.


పట్నాయక్‌కి హాకీ అంటే ఎందుకు ఇష్టం


న‌వీన్ ప‌ట్నాయ‌క్ గ‌తంలో హాకీ ప్లేయ‌ర్. ఆయ‌న డూన్ స్కూల్‌లో చ‌దువుతున్న స‌మ‌యంలో గోల్‌ కీప‌ర్‌గా జట్టుకు సేవలు అందించారు. అందుకే ఆ ఆట‌పై అంత మక్కువ. ఆ మక్కువతోనే ఏకంగా టీమిండియా హాకీ జట్టుకు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి వెనుకాడలేదు. కేవలం పురుషుల జట్టుకే ఆయన స్పాన్సర్ చేయలేదు... మహిళల జట్టుకూ స్పాన్సర్‌షిప్ అందించారు. పట్నాయక్ సర్కారు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుని మూడేళ్లయింది. మూడేళ్లకే మన కుర్రోళ్లు భారత్‌కు పతకం అందించారు. మరోపక్క మ‌హిళల జట్టు కూడా కాంస్యం కోసం ఒక్క విజయం దూరంలో ఉంది. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు ఆడిన ప్రతి మ్యాచ్‌ని పట్నాయక్ చూశారు. ఇప్పుడు పతకం గెలిచిన తర్వాత కూడా పట్నాయక్ టీమిండియాతో మాట్లాడారు. ఆగస్టు 16న భువనేశ్వర్ కలుద్దాం అని తెలిపారు.   






హాకీ టోర్నీ ఏదైనా... ఒడిశాలోనే
సామాన్యంగా ఏదైనా టోర్నమెంట్‌కి ఆతిథ్యం ఇవ్వాలంటే... ఆర్థిక పరిస్థితులు చూస్తారు. అలాగే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అన్న ఆలోచన ఉంటుంది. కానీ పట్నాయక్ సర్కారు అదేమీ ఆలోచించకుండా హాకీ కోసం ఎలాంటి టోర్నీ అయినా ఆ రాష్ట్రంలో నిర్వహించేందుకు ముందుకు వచ్చింది.


ఈ క్రమంలోనే 2014లో ఒడిశా ప్ర‌భుత్వం ఛాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్య‌మిచ్చింది. ఆ టోర్నీపై ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఆ త‌ర్వాత 2017లో ఒడిశా ప్ర‌భుత్వం స్పాన్స‌ర్‌గా ఉన్న క‌ళింగ లాన్స‌ర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వ‌ర‌ల్డ్ లీగ్‌ను, 2019లో ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ ఫెడ‌రేష‌న్ మెన్స్ సిరీస్ ఫైన‌ల్స్‌, ఒలింపిక్ హాకీ క్వాలిఫ‌య‌ర్స్‌, 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలోనే జ‌రిగాయి. ఇలా టోర్నమెంట్ ఏదైనా భారత జట్టు వేసే ప్ర‌తి అడుగులోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెర వెనుక హీరోగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పతకం గెలిచిన పురుషుల జట్టుకు సమానంగా నవీన్ పట్నాయక్‌కు దేశం సలాం చేస్తోంది.