Inspirational Women Draupadi from Mahabharat:  మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం , స్త్రీ మూర్తి గొప్పతనం, మహిళలు పవర్ ఫుల్ చెప్పుకుంటున్నాం..అయితే మహిళలు ఇప్పుడిప్పుడే కాదు యుగయుగాలుగా పవర్ ఫుల్లే. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం..ఇప్పుడు కలియుగం..ఏ యుగంలో అయినా మహిళా ప్రధాన్యత తగ్గలేదు అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. మహాభారతకాలం గురించి మాట్లాడుకుంటే ద్రౌపది గురించి చెప్పుకోవాలి. మహాభారత యుద్ధానికి కారణం ఆమె అని చెప్పుకుంటున్నారంటే అంతకుమించిన వ్యూహకర్త ఎవరని చెప్పగలం...


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం


అద్భుతమైన వ్యూహకర్త ద్రౌపది
ద్రుపదుడి యఙ్ఞవాటికలో అగ్ని నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. అందమైన, బలమైన స్త్రీ మాత్రమే కాదు మంచి వ్యూహకర్త కూడా. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంత మందితో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని ఒక్కోక్కరికీ బుద్ధిచెప్పింది. దురహంకార రాజులను నాశనం చేయడానికే శచీదేవి ఈ అవతారం ఎత్తింది.  తనను నిండు సభలో అవమానించిన సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ పాండవులను కార్యోన్ముఖులను గావించి మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైంది. నిండు సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తించుకోవడమే కాదు, పాండవుల్లో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఓ దశలో సంధి చేసుకునేందుకు ధర్మరాజు ప్రయత్నించినా...తనకు సంధి వద్దని స్పష్టంగా చెప్పేసింది ద్రౌపది. వాస్తవానికి ద్రౌపది ఎంత పవర్ ఫుల్ అంటే...ఆమె మాట్లాడితే ఎదురు చెప్పడానికి కూడా ఐదుగురు భర్తలు సాహసించేవారు కాదు. అంటే ఆమె ఆలోచన, అభిప్రాయం తిరిగి మాట్లాడలేనంత స్పష్టంగా ఉండేవని అర్థం.


Also Read: శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఎప్పుడొచ్చింది, పంచాంగ శ్రవణం ఎందుకు!


13 ఏళ్లు జుట్టు విరబోసుకుని ఉన్న ద్రౌపది
మాయాజూదంలో ధర్మరాజు తాను ఓడిపోవడమే కాదు సోదరులు, రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ఈ ఓటమి తర్వాత ద్రౌపది తమ బానిస కాబట్టి ఆమెను సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆఙ్ఞాపిస్తాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ద్రౌపదని నిండు సభలోకి ఈడ్చుకొస్తాడు. ప్రస్తుతం మాకు బానిసవు, ఎవరికీ దీనిపై ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదంటూ ఆమె మేలి ముసుగు తొలగించి దుశ్శాసనుడు అవమానిస్తాడు. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు తన తొడపై కూర్చోమని ఆహ్వానిస్తాడు. రక్షించమని పాండవుల వంక దీనంగా చూసి అర్థించినా వారు నిస్సహాయులై ఏమీ చేయలేక చూస్తుండిపోతారు. సభలో ఉన్న పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేక ఆగిపోతారు. ఆ సమయంలో కృష్ణుడు రక్షిస్తాడు. ఈ పరాభవానికి గుర్తుగా..తనను వెలయాలిలా ఈడ్చుకొచ్చిన దుశ్శాననుడి రక్తం కళ్లజూసిన వరకూ తన కురులను ముడివేయనని  కురు సభలోనే శపథం చేసింది. అందుకే 13 ఏళ్ల పాటు జుట్టు విరబోసుకునే ఉంది ద్రౌపది.


ఎవరైతే తనను నిండు సభలో అవమానించారో వారి రక్తంతోనే తన శిరోజాలను తడిపినంతవరకు వాటిని ముడివేయనంది.  దుశ్శాసనుడి రక్తం తాగి, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తెస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు భీముడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం వరకూ ఆమె ఎదురుచూసింది. మహాభారత యుద్ధంలో భీముడు తన మాటని నెరవేర్చుకున్నాడు. దుశ్శాసనుడిని చంపి రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. దుశ్శాసనుడి రక్తాన్ని తన జట్టుకు రాసిన తర్వాతే ఆమె వాటిని ముడివేసింది. అందుకే ద్రౌపది శపథం కూడా మహాభారత సంగ్రామానికి ఓ కారణం అని చెబుతారు.. 


అవమానం ఎదుర్కొన్న స్త్రీ శపథం చేసి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇలా ఉంటుందని చెప్పేందుకు పురాణాల్లో ఇంతకు మించి చెప్పుకోదగిన పాత్ర ఏముంటుంది.