భీముడు-హిడింబి ప్రేమకథ
మహాభారతంలో ఎన్నో ప్రేమకథలున్నాయి..వాటిలో తొలిచూపులో వలచి ఒక్కటైన జంట భీముడు-హిడింబి. పాండవులు లక్కఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత అడవిలోకి వెళ్తారు. అంతా నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతో వాళ్లను గుర్తుపట్టిన హిడింబాసురుడు, చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు. కానీ హిడింబి భీముడిని తొలి చూపులోనే ప్రేమిస్తుంది. భీముడు అంగీకరించకపోయినా తనపై ఉన్న ప్రేమతో...‘మా అన్నవల్ల మీకు ముప్పు ఉంది, ఈ ప్రాంతాన్ని వదిలి పొమ్మ’ని సలహా ఇస్తుంది.  ఆ తర్వాత భీముడు యుద్ధంలో హిడింబాసురుడిని చంపుతాడు. తాను ఒక స్త్రీని అనే బిడియం లేకుండా నిర్మలమైన ప్రేమను తెలియజేస్తుంది. కానీ భీముడు దీనికి తక్షణమే అంగీకరించలేదు. ‘కొంతకాలమే కలిసి ఉంటాను, తర్వాత మేం వెళ్లిపోతాం’అని చెబుతాడు. అన్ని షరతులకు అంగీకరించిన హిడింబిని భీముడు గాంధర్వ వివాహం చేసుకుంటాడు. 


ఘటోత్కచుడి పుట్టక
వీరి ప్రేమకు గుర్తుగా పుట్టిన వాడే ఘటోత్కచుడు. హిడింబి కేవలం ఉత్తమ ప్రేమికురాలే కాదు. ఆదర్శమైన తల్లి కూడా. కొడుకు పుట్టిన తర్వాత భీముడు, మిగిలిన పాండవులు, కుంతి.. ఆమెను అడవిలోనే వదిలేసి అజ్ఞాతవాసానికి వెళ్లిపోతారు. అయినా ఆమె భర్త భీముడికి ఇచ్చిన మాటమేరకు వారి వెంట వెళ్లదు.  మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. పాండవులపై అభిమానం కలిగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు వాళ్లకు సాయం చేయమంటుంది. యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తూ ఘటోత్కచుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చనిపోతాడు. 


Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
హిడింబి మాతా దేవాలయం
ఘటోత్కచుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలనాభారాన్ని తీసుకునే వరకూ తనయుడితో పాటూ ఉన్న హిండింబి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయింది. అక్కడ తపస్సు చేసి అనేక దివ్యశక్తులను పొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతవాసులు హిడింబిని దైవంగా భావిస్తారు. అమ్మగా కొలుస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువైన హిడింబి మాతా దేవాలయంలో ఏటా వసంతరుతువులో దూంగ్రీ మేళా పేరుతో మూడురోజుల పాటూ  కన్నుల పండువగా ఉత్సహం జరుపుకుంటారు. ఈ హిడింబి మాత దేవాలయాన్ని మహారాజా బహదూర్‌సింగ్ నిర్మించాడు.  


దట్టమైన దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ ఓ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి ఆపద సంభవించినా ప్రజలు హిడింబామాతను వేడుకుంటారు. నిండుమనసుతో పూజలు చేసి ఆమె దీవెనలు అందుకుంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మినహా మిగిలిన కాలమంతా హిడింబి ఆలయంలో మంచుపేరుపోయి ఉంటుంది. ఈ ఆలయాన్ని మొత్తం చెక్కతో నిర్మించారు.  హిడింబి ఆలయంలోపల ఓ పెద్దరాయి మీద ఆమె పాదముద్ర కూడా ఉంది. ఈదేవాయలం శిఖరం ఎత్తు 24 మీటర్లు. గుడి ద్వారాలు కూడా చక్కటి నగిషీలతో ఆకర్షణీయంగా ఉంటాయి. గర్భగుడిలో హిడింబామాత విగ్రహం మూడు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఈ గుడికి 70 మీటర్ల దూరంలో హిడింబి మాత కుమారుడు ఘటోత్కచుడి ఆలయం ఉంటుంది. 


Also Read: ధర్మరాజు చెప్పిన అబద్ధం.. చరిత్రలో నిలిచిపోయింది.. ఇప్పటికీ అదే జరుగుతోంది..