2022 ఏప్రిల్ 2 శనివారం ఉగాది


చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ


బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం.మొదటి నెల చైత్రం.మొదటి తిథి పాడ్యమి.మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. అందుకే తెలుగుసంవత్సరాల్లో మొదటిది ప్రభవ. అందుకే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం.బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే…864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుర్దాయం.


ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు.అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తైంది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం.



  • మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి

  • శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే

  • వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే

  • తెలుగువాళ్ల చాంద్రమానాన్ని అనుసరిస్తారు.


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


కాలగమనంలో మార్పు తప్పదు.కల్పంలో మహాయుగాలు, యుగాలు ఉన్నాయి. ప్రతీవాటికి ధర్మాలు మారుతూంటాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది.తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి.ఆయా సంవత్సరాల పేర్లనుబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవనుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. 



  • ఒక ఐతిహ్యం ప్రకారం శ్రీకృష్ణుడికి 16,100మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు.

  • నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథకూడా ప్రచారంలో ఉంది.

  • దక్షప్రజాపతి కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు. 


హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఉగాదిని తెలుగురాష్ట్రాల్లో, కర్ణాటకలో 'ఉగాది'గా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. ఏదేమైనా ఈ ఉగాదితో ప్రారంభయ్యే శుభకృత్ నామసంవత్సరం అందరకీ శుభాలు తెస్తుందని ఆశిద్దాం.


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 


Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే