Badrinath Temple In Uttarakhand: మన ప్రాచీన సనాతన ధర్మంలో ఆలయాల సందర్శన అనేది అత్యంత పవిత్రమైన కార్యం మన జీవిత కాలంలో చార్ ధామ్ యాత్ర చేపట్టాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ చార్ ధామ్ లో అత్యంత ముఖ్యమైనది బదరీనాథ్ క్షేత్రం. ఇక్కడ సాక్షాత్తు నారాయణుడు బదరీనాథుడి రూపంలో భూమిపైన అడుగు పెట్టాడు. వైష్ణవులు పూజించే 108 దివ్య క్షేత్రాలలో బదరీ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. ఈ బదరీ క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గర్వాల్ పర్వతశ్రేణుల్లో అలకనంద నది ఒడ్డున ఈ పవిత్ర దేవాలయం కొలువు తీరింది. ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణ బదరీ నారాయణుడిగా అవతరించారు. బదరీ క్షేత్రం అత్యంత పవిత్రమైన నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటి వీటిని చార్ ధామ్ అంటారు. అందులో ఒకటి పూరి, రెండవది ద్వారక, మూడవది రామేశ్వరం, నాలుగవది బదరీనాథ్ కావడం విశేషం


బదరీ క్షేత్రాన్ని శ్రీమహావిష్ణువు నివాసం ఉండే వైకుంఠంతో పోల్చుతారు. క్షీరసాగరంలో ఉండే శ్రీమహావిష్ణువు రెండవ నివాసమే బదరీ క్షేత్రం. ఇక్కడ సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కొలువుతీరి ఉన్నాడని భక్తుల విశ్వాసం.


 శ్రీమహావిష్ణువు కొలువైన ఈ క్షేత్రం చలికాలంలో ఆరు నెలల పాటు మూసివేసి ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఆరు నెలల పాటు తీవ్రమైన చలిగాలుల వల్ల ఈ క్షేత్రం మంచుతో కప్పబడి ఉంటుంది. దీంతో ఇక్కడికి భక్తులను ఎవరిని అనుమతించరు. ఇక్కడ ఉన్న ప్రధాన దేవతను సమీపంలోని జోషి మఠం తరలిస్తారు. మళ్ళీ ఆరు నెలల తర్వాత గుడి తలుపులు తెరుస్తారు. అయితే ఈ ఆరు నెలల పాటు గుడి లోపల అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్యోతి మళ్లీ గుడి తలుపులు తెరిచే వరకు ఆరు నెలల పాటు అఖండంగా వెలుగుతూ ఉంటుంది.


బదరీ క్షేత్రాన్ని పరమశివుడే శ్రీమహావిష్ణువుకు దానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కైలాస పర్వతశ్రేణులకు దిగువన ఉండే ఈ పవిత్ర క్షేత్రం అలకనంద నది ఒడ్డున కొలువుతీరి ఉంది వైష్ణవ  మతం ఆచరించేవారు సందర్శించే 108 దివ్య క్షేత్రాలలో ఈ బదరీ క్షేత్రం కూడా ఒకటి.



బదరీ నారాయణుడికి ఆ పేరు రావడం వెనుక స్థానికంగా లభించే బదరీ చెట్లే కారణం అని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ కొండల నడుమ శ్రీమహావిష్ణువు జోజోబా చెట్లు వీటినే బదరీ వృక్షాలు అని కూడా పిలుస్తారు. ఈ చెట్ల నీడన విష్ణు మూర్తి ఆశ్రయం తీసుకున్నాడని, శ్రీమహావిష్ణువుకు ఆశ్రయం ఇవ్వడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి చెట్టు రూపంలో ఇక్కడ ఆవిర్భవించిందని అందుకే శ్రీమన్నారాయణుడిని ఇక్కడ బదరీ నారాయణడిగా భక్తులు కొలుస్తుంటారు.


బదరీ క్షేత్రంలో ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు. ఈ పవిత్ర బదరీ క్షేత్రంలో ఆదిశంకరాచార్యుల మఠం ఆధ్వర్యంలో పూజలు నడుస్తుంటాయి, బదరీ క్షేత్రంలో తెలుగువారు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సైతం ఇక్కడ భక్తుల కోసం సత్రం నిర్మించారు.


Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!