Spirituality:  నుదుటన కుంకుమ ధరించడం అనేది అనాదిగా కొనసాగుతూ వస్తున్న ఒక హిందూ సంప్రదాయం.  భారతీయుల్లో నుదుటున తిలకం ధరించడమనేది ముఖ్యంగా హిందువుల్లో చాలా ముఖ్య  విషయం. ప్రతి ఒక్కరూ తిలకధారణ చేస్తారు. ముఖ్యంగా పండుగలు, పర్వదినాల్లో తప్పనిసరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. తిలకధారణను హిందువులు తమ గుర్తింపుగా భావిస్తారు కూడా.  ఇది కేవలం మతాచారం మాత్రమే కాదు దాని వెనుక కొన్ని ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది.


ఫాల భాగంలో జ్యోతి స్వరూపంలో జీవాత్మ


హిందుత్వంలో దేహాన్ని దేవాలయంగా భావిస్తారు. శరీరంలోని ప్రతి అవయవంలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతారు. ఫాలభాగం బ్రహ్మస్థానం. కనుక అక్కడ తిలకధారణ చేయ్యాలని శాస్త్రం వివరిస్తోంది. మనలోని జీవాత్మ జ్యోతిస్వరూపంగా ఫాల భాగంలో ఉంటుందని అంటారు. ఈ భాగాన్ని యోగాలో ఆజ్ఞా చక్రంగా అభివర్ణిస్తారు. ఒక్కట తిలకం ధరించడం వల్ల భక్తి కలిగి నిజాయితీగా జీవితం గడిపేందుకు దోహదం చేస్తుందట.


వృత్తి, వర్ణాన్ని అనుసరించి తిలక ధారణ


ఇది వరకు రోజుల్లో చాతుర్వర్ణాల వారు వారి వారి వృత్తి, వర్ణాన్ని అనుసరించి తిలక ధారణ చేసేవారు. వారి తిలకం వారికి ఒక గుర్తింపు. బ్రాహ్మణులు పౌరోహిత్యం చేసే వారు తెల్లని చందనాన్ని తిలకంగా నుదుటన ధరించేవారు. క్షత్రియులు వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమ, వైశ్యులు సంపదకు చిహ్నంగా పచ్చని కేసరిని, శూద్రులు నల్లని భస్మాన్ని నుదటన తిలకంగా ధరించేవారట. అంతేకాదు విష్ణు భక్తులు చందన తిలకాన్ని నామంగా, శివభక్తులు భస్మ త్రిపుండ్రాన్ని, దేవి ఉపాసకులు ఎర్రని కుంకుమ బొట్టును తిలకంగా ధరిస్తారు.


Also Read: కలియుగం ఇంకా ఎన్నేళ్లుంది - కల్కి అవతరించేది అప్పుడేనా!


తిలకం ధరించకుండా చేసే దానం ఫలించదా!


భగవంతుడికి సమర్పించిన చందనం లేదా కుంకుమ లేదా విభూతి ని ప్రసాదంగా నుదుటన ధరిస్తారు.  జ్ఞాపక శక్తి వృద్ధికి శక్తి స్థానమైన నుదుటన, కనుబొమ్మల మధ్య తిలక ధారణ చేస్తారు. అన్ని వ్యవహారములలో ధర్మబద్ధంగా నడచుకుంటాను అని దేవుడికి మనం చేసే వాగ్ధానంగా దీన్ని భావించాలని పండితులు చెబుతున్నారు. మతాచారాల్లోనూ బొట్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. నుదుట తిలకం ధరించకుండా చేసే దానం, హోమం, పుణ్య కార్యలు, తపస్సు ఏదైనా సరే నిష్ఫలమని శాస్త్రం ఘోషిస్తోంది. అంతేకాదు ముఖాన ధరించిన బొట్టు దిష్టి తగలకుండా కాపాడుతుందని నమ్మకం.


ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి!


వేలితో బొట్టు పెట్టుకోవడం శ్రేష్ఠం. అయితో కొందరు ఉంగరం వేలితో పెట్టుకోవాలని మరికొందరు మధ్య వేలితో పెట్టుకోవాలనే విభిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఉంగరం వేలితో పెట్టుకునే బొట్టు వల్ల శాంతి, జ్ఞానం సిద్ధిస్తాయి. మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువృద్ధి, సంపదవృద్ధి కలుగుతుంది. బొటన వేలితో పెట్టుకున్నా మంచిదే. కానీ చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు. నుదుటన బొట్టుగా కుంకుమ, చందనం, సింధూరం ధరించాలి. ఇప్పుడు ఆధునికులు ధరిస్తున్న స్టిక్కర్లు కేవలం అలంకారప్రాయం మాత్రమే. వాటితో ఎటువంటి లాభం లేదని గుర్తించాలి.


Also read : కష్టాలు వెంటాడుతున్నాయా? కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి చూడండి, తప్పక మంచి జరుగుతుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial