Ratha Saptami Pooja Vidhanam In Telugu : ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. భూమికి మొట్టమొదటగా దర్శనమిచ్చి, రథాన్ని అధిరోహించాడని ‘మత్స్య పురాణం’ చెబుతోంది. ప్రాణులకు చలిని తొలగించి, నూతనోత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇతర మాసాలలో సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత వుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్యకశ్యపులకు సూర్యుడు జన్మించాడు.అందుకే ఈ రోజు సూర్య భగవానుడిని తమ శక్తికొలది పూజిస్తారు...


సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి


Also Read: కోణార్క్, అరసవెల్లి మాత్రమేకాదు - గుజరాత్ లో ఉన్న ప్రముఖ సూర్య దేవాలయం గురించి తెలుసా!


పాలు పొంగించే విధానం



  • సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.

  • ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి

  • ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం అంటే సూర్యునికి ఎంతో ప్రీతి

  • పంటలు చేతికొచ్చే కాలం లో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పరమాన్నం లో కొత్త బియ్యం వాడుతారు. బెల్లం వేసి చెరుకు గడతో తిప్పుతు పరామానాన్ని తయారు చేయాలి

  • ఈ పరమానాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చేయాలి

  • పాలు పొంగించడమంటే  ఇంటి అభివృద్ధికి సంకేతం. ముందుగా గణపతిని పూజించి...ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి.


Also Read: ఈ ఆలయంలో ప్రతి శిల్పం ఓ పాఠం చెబుతుంది, రథ సప్తమి స్పెషల్


సూర్యారాధన వెనుకున్న ఆరోగ్య రహస్యం



  • ఆయుర్వేదం ప్రకారం కఫరోగ, పిత్త, బుద్ధిమాంద్యాలను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు, రేగు పళ్లకు ఉంది అని చెబుతారు.. అందుకే రథసప్తమి రోజు  తలపై జిల్లేడు ఆకు దానిపై రేగు పండుని ఉంచి స్నానం చేయాలని చెబుతారు.

  • ఈ కాలం లో విరివిగా పాకే తీగ జాతికి చెందిన చిక్కుడు ఆకులపై పరమాన్నం వేసి సూర్యునికి నివేదిస్తారు. ఆయుర్వేద రీత్యా చిక్కుడు ఆకులు, కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తి ఇస్తాయి. చిక్కుడు తరచు తినడం వలన మలబద్ధకం సమస్యలు తొలగుతాయి

  • ఈరోజు తరిగిన కూరగాయలు తినకూడదు… చిక్కుడు కాయలతో చేసిన కూర మాత్రమే తినాలని (చిక్కుడు కాయలను తరగవలసిన పనిలేదు.. చిక్కితే సరిపోతుంది ) పెద్దలు చెప్పడం లో ఉద్దేశ్యం కనీసం ఈరోజైనా చిక్కుడు కాయలు తినాలి అని చెప్పడమే.

  • అగస్త్యుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రతి రోజు పారాయణ చేసేవారు ఈ రోజు 12 సార్లు పారాయణం చేయాలి.


ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. ఏ విధం గా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ  రధసప్తమి రోజు స్త్రీలు వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు గొడుకు, చెప్పులు, ఎరుపు వస్త్రం, ఆవుపాలు, ఆవునెయ్యి దానం చేయడం మంచిది.  రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.